మొండికుంట, భద్రాచలంలో గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-09-18T06:03:46+05:30 IST
భద్రాద్రి జిల్లాలో శుక్రవారం రెండుచోట్ల గంజాయి పట్టుబడింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి ఢిల్లీ తరలిస్తున్న సుమారు 90కిలోల గంజాయిని అశ్వాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.
అశ్వాపురం/భద్రాచలం టౌన్, సెప్టెంబరు 17 : భద్రాద్రి జిల్లాలో శుక్రవారం రెండుచోట్ల గంజాయి పట్టుబడింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి ఢిల్లీ తరలిస్తున్న సుమారు 90కిలోల గంజాయిని అశ్వాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అశ్వాపురం ఏఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ వాహనంలో ఒక మహిళ, ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వాహనాన్ని తనిఖీ చేశారన్నారు. తాము సౌత్ ఢిల్లీకి చెందిన వారమని.. తమ పేర్లు మొహమ్మద్ సబీర్(22), మొహమ్మద్ మరియం(30), మహరాష్ట్ర నాగపూర్కు చెందిన మొహమ్మద్ తోపిక్ ఖాన్(20), సోనీ సుమిత్ (23) అని వారు పోలీసులకు వెల్లడించారని తెలిపారు. తాము విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్నట్టు తెలపడంతో నిందితుల నుంచి రూ.13.50లక్షల విలువచేసే 90కిలోల గంజాయిని, రూ.70వేల నగదు, కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ సీఐ బాన్ప్రకాశ్, ఏఎస్ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే భద్రాచలం పట్టణ ఎస్ఐ మధుప్రసాద్ ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో రెండు ఆటోలు, ఒక టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు అనుమానస్పదంగా కనిపించాయి. దీంతో వాటిని తనిఖీ చేయగా మొత్తం 70కిలోల గంజాయి గుర్తించారు. దీంతో వారిని విచారించగా ఇల్లెందుకు చెందిన కంభంపాటి రామారావు, బత్తుల శ్యామ్సుందర్, బూర్గంపాడుకు చెందిన చీకటి లక్ష్మీ, కాసుల నవీన్, భద్రాచలానికి చెందిన రేగులగడ్డ రాజేష్గా తెలిసిందని సీఐ స్వామి విలేకరులకు వెల్లడించారు. వీరు ఏపీలోని వలసగడ్డ గ్రామం నుంచి మహారాష్ట్రకు తరలిస్తూ పట్టుబడ్డారు. నింధితుల వద్ద స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.14లక్షలు వుంటుందని ఆయన తెలిపారు. పట్టుబడిన ఒక మహిళతో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన్నట్టు సీఐ తెలిపారు. తనిఖీల్లో పట్టణ ఎస్ఐ మధు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.