ఓఎల్‌ఎక్స్‌ తరహా ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-10-19T10:21:25+05:30 IST

ఓఎల్‌ఎక్స్‌ తరహా ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఓఎల్‌ఎక్స్‌ తరహా ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

 పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి


కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 18 : ఓఎల్‌ఎక్స్‌ తరహా ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఓఎల్‌ఎక్స్‌తో పాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రాం, షాప్‌క్లూస్‌ల పేరిట ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాల సంఖ్య పెరుతున్నదని అన్నారు. వివిధ రూపాల్లో వస్తున్న ప్రకటనలు, లింక్‌లను తెరిచినట్లయితే మోసపోవటం తప్పదని హెచ్చరించారు. ఇటువంటి ఆకర్షణీయ ప్రకటనలపై అప్రమత్తంగా లేనట్లయితే లక్షల్లో నష్టపోతారని అన్నారు. వివిధ రకాల వస్తువుల విక్రయాలు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాలు, బ్యాంక్‌ ఖాతాల వివరాలు, ఆన్‌లైన్‌ గేమ్‌ల ద్వారా ఏటీఎం, క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌ పేల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటువంటి మోసాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలన్నారు. వీటిని అరికట్టేందుకు కమిషనరేట్‌ కేంద్రంలో సైబర్‌ ల్యాబ్‌ 24 గంటల పాటు పని చేస్తుందన్నారు.


ఎవరైనా వాహనాలు, వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా పరిశీలించిన తరువాతనే కొనుగోలు చేయాలని సూ చించారు. ఆన్‌లైన్‌లో ఆకర్షనీయమైన వాహనాలు, వస్తువులను అమ్మకానికి పెట్టిన సమయంలో క్యూఆర్‌కోడ్‌, ఫోన్‌ పే, గూగుల్‌పే ద్వారా అమాయకుల నుంచి డబ్బులను వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. 

Updated Date - 2020-10-19T10:21:25+05:30 IST