Shocking : మీ ఫోన్‌లో Whatsapp ఉందా.. అర్జెంట్‌గా ఈ విషయం తెలుసుకోండి...!

ABN , First Publish Date - 2021-08-19T16:13:57+05:30 IST

Shocking : మీ ఫోన్‌లో Whatsapp ఉందా.. అర్జెంట్‌గా ఈ విషయం తెలుసుకోండి...!

Shocking : మీ ఫోన్‌లో Whatsapp ఉందా.. అర్జెంట్‌గా ఈ విషయం తెలుసుకోండి...!

  • వాట్సాప్‌ హ్యాక్‌ చేసి...
  • కాంటాక్ట్‌ లిస్టులో నెంబర్లకు డబ్బులు.. కావాలంటూ మెసేజ్‌లు
  • రూ.లక్షలు పంపి మోసపోయిన బాధితులు

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : మీ వాట్సాప్‌కు ఫ్రెండ్స్‌ పేరుతో లింక్స్‌ వస్తున్నాయా..? వాటిని క్లిక్‌ చేసే ముందు ఓసారి ఆలోచించండి. అవి హ్యాకర్లు పంపిన లింక్స్‌ కావొచ్చు. తాజాగా సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు వస్తున్న ఫిర్యాదులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓ ప్రముఖ సంస్థ ఎండీ వాట్సాప్‌ నెంబర్‌ నుంచి సంస్థ ఉద్యోగుల వాట్సాప్‌ నెంబర్లకు ఒక మెసేజ్‌ వచ్చింది. తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని, ఎంతుంటే అంత వెంటనే తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని అందులో సారాంశం. అది నమ్మశక్యంగా లేదని కొందరు ఉద్యోగులు విషయాన్ని ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. తాను ఆ మెసేజ్‌లు పంపలేదని చెప్పారు. ఆ తర్వాత ఆరా తీయగా ఎండీ వాట్సాప్‌ అకౌంట్‌ను కేటుగాళ్లు హ్యాక్‌ చేసినట్లుగా స్పష్టమైంది. వెంటనే వారు సిటీ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


బుధవారం మరో రెండు ఫిర్యాదులు ఇలాంటివే పోలీసులకు అందాయి. షేక్‌పేట్‌కు చెందిన యువతి సోదరుడు సౌదీలో ఉంటున్నాడు. అతడి వాట్సాప్‌ నుంచి ఆమెకు రెండు రోజుల క్రితం మెసేజ్‌ వచ్చింది. తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని, అకౌంట్‌ నెంబర్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కోరడంతో, ఆమె వెంటనే రూ.1.50 లక్షలు పంపింది. అనంతరం సోదరుడికి ఫోన్‌ చేసి డబ్బులు వచ్చాయా అని అడగడంతో, ఆ మెసేజ్‌ అతడు పంపలేదని తేలింది. దీంతో ఆమె మెసేజ్‌ను స్ర్కీన్‌షాట్‌ తీసి సోదరుడికి పంపించింది. దీనిపై వారు మరింత లోతుగా పరిశీలించగా అతడి నెంబర్‌ హ్యాక్‌ అయిందని గుర్తించారు. బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ కూడా తమది కాదని తెలిసింది.


ఇదే తరహాలో తన స్నేహితుడి నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ రావడంతో రూ.లక్షన్నర ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు మారేడుపల్లికి చెందిన మరో యువకుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక లింక్‌ ద్వారా వాట్సాప్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేస్తున్న కేటుగాళ్లు డబ్బులు కావాలంటూ ఆ అకౌంట్‌లో ఉన్న కాంటాక్ట్‌ నెంబర్లకు మెసేజ్‌లు పంపి మోసాలకు పాల్పడుతున్నారని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2021-08-19T16:13:57+05:30 IST