ఆక్సిజన్ నిల్వపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-05-15T06:07:34+05:30 IST
రుయాస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, జేసీ వీరబ్రహ్మం శుక్రవారం సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, సిబ్బందిని ఆదేశించారు.
తిరుపతి(కొర్లగుంట), మే 14: రుయాస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, జేసీ వీరబ్రహ్మం శుక్రవారం సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, సిబ్బందిని ఆదేశించారు. వీరిద్దరూ శుక్రవారం ఆక్సిజన్ ప్లాంట్ వద్దకు చేరుకుని నిల్వను పరిశీలించారు. లిక్విడ్ ఆక్సిజన్తోపాటు సిలిండర్ల బ్యాకప్ కూడా 6 గంటలు సరిపడేలా తప్పనిసరి చేసుకోవాలన్నారు. ప్రతి రెండు గంటలకోసారి ఆక్సిజన్ నిల్వల రిపోర్టును వార్రూమ్కు పంపేందుకు నోడల్ ఆధికారిగా శ్యామ్ప్రసాద్ను నియమించామన్నారు. ప్రధానంగా వాల్వుల లీకేజీ, వృథాని అరికట్టాలన్నారు. ట్రయేజ్, బెడ్ల వివరాలు, వైద్యసేవలపై చర్చించారు. పాతప్రసూతి ఆస్పత్రి వద్ద కరోనా బాధితులకు చికిత్స అందించడానికి కొత్తగా ఏర్పాటుచేసిన తాత్కాలిక జర్మన్షెడ్ను పరిశీలించారు. ఎంతమందికి ఇక్కడ చికిత్స అందించవచ్చనే దానిపై చర్చించారు. ఆక్సిజన్ రహిత వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణవాయువు అందించడానికి ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ప్లాంట్నుంచి ఆక్సిజన్ పెద్దసంఖ్యలో సిలిండర్లకు నింపారు. ఆ తరువాత వాటిని అవసరమున్న వార్డుల్లోకి చేరవేశారు.