ప్రభుత్వ లాంఛనాలతో హవల్దార్ అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-05-11T05:24:27+05:30 IST
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆర్మీ హవల్దార్గా విధులు నిర్వహిస్తున్న ముసలాయిచెరువు బాల మద్దయ్య (44) పిడుగుపాటుతో మృతి చెందాడు.
బేతంచెర్ల, మే 10: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆర్మీ హవల్దార్గా విధులు నిర్వహిస్తున్న ముసలాయిచెరువు బాల మద్దయ్య (44) పిడుగుపాటుతో మృతి చెందాడు. బాలమద్దయ్య స్వగ్రామమైన సిమెంట్నగర్ గ్రామానికి సోమవారం ఆయన భౌతికకాయాన్ని తరలించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ జవాన్లు బాలమద్దయ్య అంత్యక్రియలు నిర్వహించారు. సిమెంట్నగర్ గ్రామానికి చెందిన మద్దయ్య, ఎంగమ్మ దంపతుల 5వ కుమారుడు బాలమద్దయ్య 18-3-2002లో ఆర్మీ జవానుగా విధుల్లో చేరారు. జమ్మూకశ్మీర్, లే హోలడక్ ప్రాంతంలో 14వ యూనిట్లో సుబేదార్గా విధులు నిర్వహించేవారు. పదోన్నతి కోసం రెండు నెలల సిగ్నల్స్ కోర్సు (కమ్యూనికేషన్) శిక్షణ నిమిత్తం మధ్యప్రదేశ్లోని జబల్ పూర్కు వెళ్లారు. శిక్షణ పొందుతున్న సమయంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో వర్షం కురవడంతో చెట్టుకు కిందికి వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపడి తన వద్ద ఉన్న సెల్ఫో న్ రేడియేషన్కు గుండెపోటు వచ్చింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించే లోపే మృతి చెందారని ఆర్మీ అధికారులు తెలిపారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, బేతంచెర్ల తహసీల్దారు విద్యాసాగర్, సీఐ కేశవరెడ్డి, ఎస్ఐ సురేష్, ఆర్మీ జవాన్లు బాలమద్దయ్య భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి గౌరవవందనం చేశారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, కుమార్తెలు మనీషా, గౌతమి, కుమారుడు రవీంద్ర సంతానం ఉన్నారు. వీరి కుటుంబాన్ని డీఎస్పీ నరసింహారెడ్డి, తహసీల్దారు విద్యాసాగర్, సీఐ కేశవరెడ్డిలు పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలను కుటుంబానికి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.