బిచ్చగత్తె వద్ద రూ.2.58 లక్షల నగదు లభ్యం
ABN , First Publish Date - 2021-06-02T16:59:49+05:30 IST
ఓ బిచ్చగత్తె వద్ద రెండున్నర లక్షల రూపాయలకు పైగా నగదు ప్రత్యక్షమైన ఘటన జమ్మూకశ్మీరులోని రాజౌరి పట్టణంలో...
శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): ఓ బిచ్చగత్తె వద్ద రెండున్నర లక్షల రూపాయలకు పైగా నగదు ప్రత్యక్షమైన ఘటన జమ్మూకశ్మీరులోని రాజౌరి పట్టణంలో వెలుగుచూసింది. గత మూడు దశాబ్దాలుగా రాజౌరి బస్ స్టాండు పరిసర ప్రాంతాల్లోని వీధుల్లో తిరుగుతున్న బిచ్చగత్తెకు అధికారులు మెరుగైన జీవనం కల్పించడానికి ఆమెను ప్రభుత్వ షెల్టరు హోంకు తరలించారు.అధికారులు బిచ్చగత్తె ఇప్పటి వరకు నివసించిన పశువైద్యశాల ముందు ప్రాంతంలో చెత్తను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బందిని పంపించారు. బిచ్చగత్తె నివాసమున్న ప్రాంతంలో పాలిథీన్ కవర్ల బాక్సుల్లో కరెన్సీ నోట్లు, జనపనార సంచిలో నాణేలుండటం చూసి ఆశ్చర్యపోయారు.
సమాచారం అందుకున్న అధికారులు మెజిస్ట్రేటుతోపాటు పోలీసు పార్టీని పంపించి బిచ్చగత్తె కరెన్సీని లెక్కించారు. దీంట్లో మొత్తం 2.58 లక్షలరూపాయలున్నాయని తేలడంతో వాటిని ఓ ట్రంకు పెట్టెలో పెట్టి తాళం వేసి బిచ్చగత్తెకు అప్పగించారు. యాచించిన డబ్బును దాచుకుందని అధికారుల విచారణలో తేలింది. బిచ్చగత్తె ఆచూకీ తెలియక పోవడంతో ఆమెను షెల్టరుహోంలో ఉంచారు.