దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి ఆన్లైన్లో టికెట్ల జారీ
ABN , First Publish Date - 2020-09-19T11:56:34+05:30 IST
దసరా ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఆన్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. వచ్చేనెల 17 నుంచి 25వ తేదీ వరకు
విజయవాడ (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఆన్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. వచ్చేనెల 17 నుంచి 25వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలు జరిగే పది రోజుల్లో భక్తులు రోజూ లక్షలాదిగా అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున 2 నుంచి 3 లక్షల మంది వస్తారు. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేస్తూ రోజుకు పదివేల మందిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు.
ఆన్లైన్లో టైమ్స్లాట్ ప్రకారం టికెట్లను జారీచేసి.. ఆ ప్రకారమే భక్తులను దర్శనానికి పంపించేందుకు దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నెల రోజుల ముందు నుంచే ఆన్లైన్లో టికెట్లు విక్రయించే ప్రక్రియను శుక్రవారం సాయంత్రం దుర్గగుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్బాబు, ఆలయ ప్రధాన అర్చకులు కలిసి వెబ్సైట్ ద్వారా ప్రారంభించారు.