వైసీపీని నమ్మి దారుణంగా మోసపోయాం: రాజేష్

ABN , First Publish Date - 2020-06-07T20:39:36+05:30 IST

తనపై ద్రోహి, రౌడీ షీటర్ అని పోస్టులు పెట్టది..వైసీపీలో తనతోపాటు కలిసి తిరిగిన మిత్రులేనని..

వైసీపీని నమ్మి దారుణంగా మోసపోయాం: రాజేష్

హైదరాబాద్: తనపై ద్రోహి, రౌడీ షీటర్ అని పోస్టులు పెట్టది..వైసీపీలో తనతోపాటు కలిసి తిరిగిన మిత్రులేనని ఏపీ మహాసేన చీఫ్ సరిపెళ్ల రాజేష్ అన్నారు. ఆదివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వైసీపీని నమ్మి చాలా దారుణంగా మోసపోయామన్నారు. రాష్ట్రంలో మద్యం బ్యాన్ చేస్తామని చెప్పిన సీఎం జగన్ మాటతప్పారని విమర్శించారు. లిక్కర్ వల్ల ఎక్కువగా నష్టపోయేది అణగారిన వర్గాలేనన్నారు. బ్యాన్ వల్ల తమకు మంచి జరుగుతుందని అనుకున్నామని, ఇప్పుడు మద్యంపై అధిక ధరలు పెంచి షాపులు తెరిచారని ఆరోపించారు.


అలాగే అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం జగన్ చెప్పారని, ఇప్పుడు స్థలాలు ఇవ్వలేదుగానీ, దళితుల నుంచి తిరిగి భూములు లాక్కుంటున్నారని రాజేష్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేకని.. చెప్పేదొకటి, చేసేదొకటన్నారు. ముఖ్యమంత్రితో సహా ఆ పార్టీ నేతలు చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా వ్యతిరేకంగా పనులు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక దొరకడంలేదు కానీ మద్యం మాత్రం నిరంతరం దొరుకుతోందని రాజేష్ విమర్శించారు. మద్యంతో ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. రేట్లు పెంచడంవల్ల ప్రజలు మద్యం తాగడం ఆపేస్తారంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీరు అందరికీ అర్థమైందని, సరైన బుద్ది చెప్పే సమయం దగ్గరలోనే ఉందని రాజేష్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-07T20:39:36+05:30 IST