శరవేగంగా..
ABN , First Publish Date - 2021-07-30T05:25:04+05:30 IST
శరవేగంగా..
80 శాతం పూర్తయిన బెంజ్-2 ఫ్లై ఓవర్ పనులు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : బెంజ్సర్కిల్-2 ఫ్లై ఓవర్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం గడ్డర్ల నిర్మాణం, శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. గడ్డర్ల పనులు మూడొంతులు పూర్తికాగా, జంక్షన్ల వద్ద మాత్రమే మిగిలి ఉన్నాయి. బెంజ్సర్కిల్, నిర్మల జంక్షన్, రమేశ్ ఆసుపత్రి జంక్షన్ల వద్ద పొడవాటి గడ్డర్లను నిర్మించాల్సి ఉంది. భారీ క్రేన్ల సాయంతో పక్షం రోజుల్లో ఈ పనులు కూడా పూర్తి చేయను న్నారు. సహజంగా ఈ గడ్డర్ల ఏర్పాటు పూర్తయ్యాకే క్రాస్ బీమ్స్ ఏర్పాటుచేసి శ్లాబు పనులు చేపడతారు. కానీ, కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్ఫ్రా ఏకకాలంలో ఈ పనులన్నింటినీ ప్రారంభించటం వల్ల ముందు గానే పూర్తవుతున్నాయి. మొత్తం 55 శ్లాబులకు గానూ ఇప్పటికే 25 పూర్తిచేశారు. అప్రోచ్ పనులు కూడా పూర్తయ్యాయి. అటు జ్యోతి కన్వెన్షన్, ఇటు రమేశ్ ఆసుపత్రి జంక్షన్ల వద్ద ఇరువైపులా అప్రోచ్లు పూర్తయ్యాయి. ఈ అప్రోచ్లకు ప్రస్తుతం క్రాష్ బ్యారియర్స్ (మినీవాల్) పనులు చేపడుతున్నారు.