‘అధికారులు స్థలాలు చూపడం లేదు’
ABN , First Publish Date - 2021-12-04T05:20:16+05:30 IST
రెవెన్యూ అధికారులు స్థలాలు చూపించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు గ్రామ శివారులోని ఇళ్ల స్థలాల్లోకి వెళ్లి శుక్రవారం హద్దులను వేసుకున్నారు.
మద్దికెర, డిసెంబరు 3: రెవెన్యూ అధికారులు స్థలాలు చూపించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు గ్రామ శివారులోని ఇళ్ల స్థలాల్లోకి వెళ్లి శుక్రవారం హద్దులను వేసుకున్నారు. స్థలాల్లోకి వెళ్లి ముళ్లకంచెలను తొలగించి హద్దులను వేసుకున్నారు. వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పొందామని తెలిపారు అయితే స్థలాలు లేక పోవడంతో ఇళ్లు కట్టుకోలేక అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నామన్నారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే హద్దులు చూపించకపోతే మీమే హద్దులు వేసుకుని స్థలాలు పంచుకుంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్, చిన్నపెద్ది, హుసేన్పీరా, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ నాగభూషణంను వివరణ కోరగా సమయం ఇస్తే స్థలాలు చూపిస్తామని తెలిపారు.