కరోనా హెల్త్ వర్కర్లపై మూకదాడి.. ఎక్కడంటే...
ABN , First Publish Date - 2020-04-02T22:19:09+05:30 IST
కోవిడ్-19 వ్యాప్తి గురించి పర్యవేక్షిస్తున్న కొందరు హెల్త్ వర్కర్లపై పథకం ప్రకారం కొందరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసిన అమానుష ఘటన
బెంగళూరు: కోవిడ్-19 వ్యాప్తి గురించి పర్యవేక్షిస్తున్న కొందరు హెల్త్ వర్కర్లపై పథకం ప్రకారం కొందరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసిన అమానుష ఘటన బెంగళూరులోని సాదిక్ నగర్లో చోటు చేసుకుంది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్విత్ నారాయణ్ తెలిపిన సమాచారం ప్రకారం కొందరు హెల్త్ వర్కర్లు.. కోవిడ్-19కి సంబంధించిన సమాచారం కోసం పర్యవేక్షించేందుకు సాదిక్ నగర్కు వెళ్లారు. కోవిడ్-19 వైరస్ సోకిన వారికి సహాయాన్ని అందించేందుకు వాళ్లు అక్కడ ఉన్న వెళ్లి ప్రతీ ఇంటికి తిరిగి తగిన సమాచారాన్ని కనక్కుంటుండగా.. ఈ దర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. అయితే అక్కడి మసీదు వీరిపై దాడి చేయాలని స్థానికులను రెచ్చగొట్టిందని.. దీంతో స్థానికులు వీరిపై మూకదాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా అమానుషమైన చర్య అని ఆయన తెలిపారు.
అయితే దీనికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి.. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించామని ఆయన స్పష్టం చేశారు. లేకుంటే ఇది సమాజానికి తప్పుడు సందేశాన్ని అందిస్తుందని.. తద్వారా ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని చోటు చేసుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
‘‘వాళ్లు మాతో చాలా అమానుషంగా ప్రవర్తించారు. మసీదు నుంచి ప్రకటన రాగానే గుంపుగా వచ్చి మాపై దాడి చేశారు. ముందు ఆ ప్రకటన చేసిన వాళ్లని అరెస్టు చేయాలి ప్రజలు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ల ఆరోగ్యం కోసమే మేము ఈ పోరాటం చేస్తున్నాము. స్థానిక రవాణా లేదు మా సొంత ఖర్చులతో మేము ఊరంతా తిరిగి వారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాము. ఆహారం, విశ్రాంతి లేకుండా మేము పని చేస్తుంటే.. ఇలా మాకు ఇబ్బంది కలిగించడం భావ్యం కాదు’’ అని ఓ హెల్త్ వర్కర్ తెలిపారు.
కర్ణాటకలో ఇప్పటికీ 100కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హెల్త్ వర్కర్లపై జరిగిన ఈ దాడిని అంతా తీవ్రంగా ఖండిస్తున్నారు.