లైట్ తీసుకున్నారా?
ABN , First Publish Date - 2021-11-29T05:59:01+05:30 IST
లైట్ తీసుకున్నారా?
బెంజ్-2 ఫ్లై ఓవర్పై ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం
25 కేవీ ట్రాన్స్ఫార్మార్ల ఏర్పాటుకు ముందుకురాని వైనం
దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోని అధికారులు
త్వరలోనే కేంద్రమంత్రి, సీఎం చేతులమీదుగా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం
జనరేటర్ సాయంతో లైట్లు వెలిగిస్తున్న కాంట్రాక్టు కంపెనీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెంజ్సర్కిల్-2 ఫ్లై ఓవర్కు పవర్ కష్టాలు వచ్చి పడ్డాయి. త్వరలో కేంద్రమంత్రి గడ్కరీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈ ఫ్లై ఓవర్పై ట్రాన్స్కో అధికారుల నిర్వాకం కారణంగా లైట్లు వేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. చేసేదేమీలేక కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్ఫ్రా (ఎల్ఐడీఐపీఎల్) జనరేటర్లను ఏర్పాటు చేసి వీధి దీపాలను వెలిగిస్తోంది. ట్రాన్స్కో అధికారులకు 25 కేవీ కలిగిన రెండు ట్రాన్స్ఫార్మార్ల అవసరం ఉందని దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పటివరకు పరిష్కారం లేదు. ఎంత ఖర్చు అవుతుందో చెప్పమన్నా చెప్పలేదు. రెండు ట్రాన్స్ఫార్మార్లలో ఒకటి ట్రెండ్సెట్ దగ్గర, మరొకటి రమేశ్ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెంటికీ రింగ్రోడ్డు సెక్షన్ ట్రాన్స్కో అధికారులు అనుమతి ఇవ్వాలి. వారి నుంచి స్పందన లేకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.