భేష్‌!

ABN , First Publish Date - 2021-06-17T05:40:59+05:30 IST

పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

భేష్‌!
మేడ్చల్‌ : మునీరాబాద్‌లోని నర్సరీ

  • అభివృద్ధిబాటలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 
  • పలు గ్రామాలు, మండలాల్లో మారిన రూపురేఖలు 
  • ఎన్‌ఆర్‌జీఎస్‌ పనుల్లో పురోగతి
  • కరువు, కరోనా కాలంలోనూ ‘ఉపాధి’ 
  • నిధులు భారీగా విడుదల చేస్తున్న ప్రభుత్వం
  • మెరుగుపడిన మౌలిక సదుపాయాలు


పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి బాటలు పరుచుకున్నాయి. ఈ కార్యక్రమాల కింద ప్రభుత్వం నిధులు కూడా భారీగా ఖర్చు పెడుతుండడంతో అనేక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మొరుగు పడ్డాయి. పల్లెల్లో కూలీలకు కరువు కాలంలోనూ ఉపాఽధి మొండుగా లభిస్తోంది.  ప్రభుత్వం ఈ కార్యక్రమా లకు ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నిత్యం ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను ప్రభుత్వం భాగస్వామ్యం చేయడంతో అనేక గ్రామాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈ కార్యక్రమం కింద హరితహారం కూడా నిర్వహిస్తుండడంతో అనేక గ్రామాలు, మున్సి పాలిటీల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోంది. పల్లెలు., పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు సంబం ధించి ప్రభుత్వం ర్యాంకులు కూడా ఇస్తోంది. దీంతో అధికారులు, వార్డు సభ్యులు పోటీపడి పనిచేస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. ఇలా అభివృద్ధిలో ముందు ఉన్న జిల్లాలోని మూడు మండలాలు, మూడు గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసి ఉత్తమమైనవిగా ప్రకటించింది. అలానే అఽధాన్నంగా ఉన్న మూడు మండలాలు, మూడు గ్రామాలను కూడా ఎంపిక చేసింది. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ఈ అభివృద్ధికి కారకులైన అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను అభినందిస్తోంది. ఉత్తమ గ్రామాలు, మండలాలుగా వీటిని తీర్చిదిద్దడానికి  చేసిన కృషి ఏమిటి? ఎలాంటి అభివృద్ధి సాధించారు? గ్రామాల్లో అభివృద్ధి ఫలాలు ఎలా ఉన్నాయి? అన్న అంశంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం...


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌/ కోట్‌పల్లి/ మర్పల్లి/ బంట్వారం/ కులకచర్ల : వికారాబాద్‌ మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ పంచాయతీల్లో ఎన్‌ ఆర్‌ఈజీఎస్‌ పనులతోపాటు వన నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డుల పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. దీంతో వికారాబాద్‌ మండలం అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది. ఈ మండలం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో రాష్ట్రస్థాయిలోనే 6వస్థానంలో నిలిచింది. దీనికితోడు మండలం లోని పలు గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలన్నీ పచ్చ దనాన్ని పరుచుకున్నాయి. ట్రాక్టర్లు, రిక్షాల ద్వారా తడిపొడి చెత్తను గ్రామ కార్మికులతో డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. దానితో ఎరువులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా కోట్‌పల్లి కూడా ఉత్తమ మండలంగా ఎంపికైంది. ఈ మండలంలో 18 పంచాయతీలున్నాయి. ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు అభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కంపోస్టుషెడ్‌లు, నర్సరీలు, పల్లె ప్రకృతివనం, శ్మశానవాటికలు, రైతువేదికల నిర్మాణం ఇప్పటివరకు పూర్తయింది. గ్రామాల్లో వీధిదీపాలు, పారిశుధ్య పనులు, పిచ్చిమొక్కల తొలగింపు, దోమల మందు పిచికారి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఈ మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికై జిల్లా చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న పట్నం సునీతమహేందర్‌రెడ్డి కూడా మండల అభివృద్ధి కోసం సుమారు రూ.2.50 కోట్లు మం జూరు చేశారు. మర్పల్లి మండలం రావులపల్లి సర్పంచ్‌ నల్ల దేవమ్మ స్థానికుల కృషితో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. గ్రామ శివారులో ప్రకృతివనం ఏర్పాటు చేసి 14రకాల మొక్కలు నాటి వాటిని సంర క్షిస్తున్నారు. స్వయంగా తానే సమయానికి మొక్కలకు నీరందించి పచ్చదనంగా మార్చి జిల్లా కలెక్టర్‌చే ఉత్తమఅవార్డు పొందారు. వికారాబాద్‌ మం డలం పులుమద్ది కూడా అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉత్తమ గ్రామంగా ఎంపికైంది. గ్రామం ఎన్‌ఆర్‌జీఎస్‌ పనుల్లో దూసుకుపోతోంది. ఫాంపాండ్‌ ట్రైన్స్‌ వర్క్‌, డైరెక్షన్‌ పనులు చేసి నీటి నిల్వల ద్వారా భూగర్భ జలాలు పెంచుతున్నారు. శానిటైజేషలో భాగంగా తడిపొడి చెత్తను వేరుచేసి వానపాములను విడిచి కంపోస్ట్‌గా తయారు చేస్తున్నారు. బంట్వారం మండలం తొర్మామిడిలో ప్రతిఒక్కరూ గ్రామాభివృద్ధి కోసం సహకరిస్తున్నారు. గ్రామంలో శ్మశానవాటిక, క్రిమిటోరియం, కంపోస్టు షెడ్డు, మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, రైతువేదిక, పల్లె ప్రకృతివనం, ఎప్పటికప్పుడు పూర్తి చేయగా నర్సరీలో 4వేల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉ న్నాయి. కులకచర్ల మండలం సా ల్వీడ్‌ పచ్చదనంతో ఉత్తమ పంచా యతీగా ఎంపికైంది. సర్పంచ్‌, అధికారులు కలిసి గ్రామస్తులను చైతన్యపరిచి గ్రామాన్ని స్వచ్చ గ్రామంగా మార్చేశారు. ఇటీ వల గ్రామాన్ని సందర్శించిన ఐఏఎస్‌ శిక్షణ అధికారులు గ్రామ విఽధానాన్ని అభినందించారు. రెండున్నరేళ్లలో 40లక్షల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి 

పనులు చేపట్టారు. 


రంగారెడ్డి జిల్లాలో..

కొత్తూరు/ఇబ్రహీంపట్నం/మహేశ్వరం/కందుకూరు: కొత్తూర్‌ మండలంలోని సర్పంచులు, అధికారులు సమష్టి కృషితో పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయి. కొత్తూరు ఉత్తమ మండలంగా ఎంపికైంది. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో వైకుంఠధామాల నిర్మాణాలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డ్‌ నిర్మాణాలు, నర్సరీలు ఏర్పాటు చేశారు. భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణాలు, సీసీ రోడ్లు నిర్మాణలు చేపట్టారు. అధికారులు. ప్రతినిధులు సమన్వయంతో ముందుకు పోతున్న కారణంగా ఇబ్రహీంపట్నం మండలం ఉత్తమ మండలంగా ఎంపికైంది. మండలంలో 14 గ్రామపంచాయతీలుండగా 7 అనుబంధ గ్రామాలున్నాయి. గతేడాది నుంచి వివిధ అభివృద్ధి పనులకుగాను రూ.13.50 కోట్లు వెచ్చించారు. పల్లెప్రగతిలో భాగంగా అన్ని గ్రామపంచాయతీల్ల్లో వైకుంఠధామాలను అభి వృద్ధి చేశారు. సీసీరోడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ పనులు ముమ్మరం చేశారు. ఉప్పరిగూడ పంచాయతీలోనైతే ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులకు తోడు సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి మరో రూ.50లక్షలు తన సొంత నిధులు వెచ్చించి పలు పనులు చేపట్టారు. అభివృద్ధిలో ప్రజలను, యువజనసంఘాలను, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయడంతో మహేశ్వరం మండలంలోని గ్రామాలు పచ్చదనం పరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి. మండలంలో మొత్తం 31గ్రామపంచాయతీలు, 20 అను బంధ గ్రామాలున్నాయి. గతేడాది నుంచి వివిధ అభివృద్ధి పనులకు రూ.6కోట్లు వెచ్చిం చారు. పల్లెప్రగతిలో భాగంగా అన్ని గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలతో ఏ గ్రామంలో చూసినా పచ్చదనం విరాజిల్లుతోంది. అలాగే మండలపరిధిలోని సిరిగిరిపురంలో శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డుల అభివృద్ధి, పచ్చదనం పెంచడంతోపాటుఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. అదేవిధంగా కందుకూరు మండలం సరస్వతిగూడ, రాచలూరులు ఉత్తమ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ గ్రా మాలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, పచ్చదనంతో కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. అగర్‌మియాగూడ అనుబంధ గ్రామం సరస్వతిగూడ నూతన పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్‌, పంచాయతీ సభ్యులు, అధికారులు కలిసి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఈ గ్రామంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో సుమారు కోటి రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి, సీసీరోడ్లు వేశారు. రాచలూరులో అభివృద్ధి పనులువేగంగా జరుగుతున్నాయి. 30రోజుల ప్రణాళికలో 24 పురాతనమైన ఇళ్లను కూల్చి ఆ స్థలాల్లో మొక్కలు నాటారు. 


మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో..

ఘట్‌కేసర్‌ రూరల్‌/మేడ్చల్‌/ శామీర్‌పేట/ మూడుచింతలపల్లి: మేడ్చల్‌ జిల్లా లోని ఘట్‌కేసర్‌, శామీర్‌పేట, మూడుచింతలపల్లిలను ప్రభుత్వం ఉత్తమ మండలాలుగా ఎంపిక చేసింది. ఈ మండలాల్లోని అన్నిగ్రామాల్లో ప్రభుత్వ పథకాలను వినియోగించు కొని అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టారు. అన్నిగ్రామాల్లో వైకుంఠధామాలు, డం పింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతివనాలు, నర్సరీలు, హరితహారం నిర్వహణలో ముందం జలో ఉండడంతో ఈ మూడు మండలాలుగా ఉత్తమంగా ఎంపికయ్యాయి. అదే విధంగా ఘట్‌కేసర్‌ మండలంలోని కాచవాని సింగారం, మేడ్చల్‌ జిల్లా మునీరా బాద్‌లు కూడా ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. కాచవాని సింగారంలో గ్రామాభివృద్ధి కోసం దాతలు విరివిగా దాతృత్వాన్ని ప్రదర్శించారు. పంచాయతీకి ట్రాక్టర్‌, చెత్త సేకరించే వాహనాలను అందించారు. అంతేకాకుండా ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌, పార్కు, కమ్యునిటీ భవనం నిర్మాణాలకు సాయం చేశారు. పల్లె ప్రకృతివనం, నర్సరీ, వైకుంఠధామల ఏర్పాటుతో గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. మేడ్చల్‌ మండలం మునీరాబాద్‌ గ్రామం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. సర్పంచ్‌, స్థానికుల సహకారంతో ఇది సాధ్యమైంది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామంలో  పచ్చ దనాన్ని నింపారు. గ్రామంలో డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, ఇంటిం టికీ ఇంకుడు గుంత, చెత్త రీసైక్లింగ్‌, పల్లెప్రకృతి వనం తదితర కార్యక్రమాలను పూర్తిస్థాయిలో పూర్తిచేశారు. పల్లె ప్రకృతి వనం, పార్కులను సుందరంగా తీర్చిదిద్దారు. 


ఉత్తమ మండలాలు

రంగారెడ్డిజిల్లా : ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కొత్తూరు

వికారాబాద్‌ జిల్లా : వికారాబాద్‌, కోట్‌పల్లి, మర్పల్లి

మేడ్చల్‌ జిల్లా : ఘట్‌కేసర్‌, శామీర్‌పేట, మూడుచింతలపల్లి


ఉత్తమ గ్రామాలు..

రంగారెడ్డిజిల్లా : సిరిగిరిపూర్‌ (మహేశ్వరం), సరస్వతిగూడ, రాచలూరు (కందుకూరు)

వికారాబాద్‌ జిల్లా : పులిమద్ది, సాల్వీడ్‌, తొర్మామిడి

మేడ్చల్‌ జిల్లా : మునీరాబాద్‌, గోధుమకుంట, కాచవాని సింగారం



Updated Date - 2021-06-17T05:40:59+05:30 IST