సైకిల్ తీసుకుని... క్షమాపణ చీటీ రాసిన వలస కార్మికుడు!
ABN , First Publish Date - 2020-05-16T17:58:14+05:30 IST
పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశంలో లాక్డౌన్ విధించారు. ఇది వలస కార్మికులకు సమస్యగా మారింది. పట్టణంలో ఉపాధి కోల్పోవడంతో తమ గ్రామాల్లోని తమ ఇళ్లకు నడుచుకుంటూ...
భరత్పూర్: పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశంలో లాక్డౌన్ విధించారు. ఇది వలస కార్మికులకు సమస్యగా మారింది. పట్టణంలో ఉపాధి కోల్పోవడంతో తమ గ్రామాల్లోని తమ ఇళ్లకు నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. తాజాగా రాజస్థాన్లోని భరత్పూర్లో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఒక కార్మికుడు స్థానికంగా ఉంటున్న ఒక వ్యక్తి సైకిల్ తీసుకుని వెళ్లాడు. అయితే ఈ సందర్భంగా ఒక లేఖరాసి అక్కడపెట్టి వెళ్లిపోయాడు. ఈ లేఖ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ లేఖలో కార్మికుడు.. నేను మీ సైకిల్ తీసుకుంటున్నాను. నన్ను క్షమించండి. నాకు ఇంటికి వెళ్లేందుకు మరో మార్గం లేదు. నాకు కుమారుడు ఉన్నాడు. నేను అతని కోసం ఇలా చేయాల్సి వచ్చింది. అతను వికలాంగుడు. అస్సలు నడవలేడు. మేము బరేలీ వెళ్ళాలి... అని రాశాడు. ఈ సందర్భంగా ఆ సైకిల్ యజమాని సహబ్ సింగ్ మాట్లాడుతూ నా సైకిల్ అవసరమైనవారికి ఉపయోగపడినందుకు సంతోషిస్తున్నాను. మా ఇంటి ప్రహారీ లోపల అనేక వస్తువులు ఉన్నాయి. అయినా ఆ వ్యక్తి సైకిల్ మాత్రమే తీసుకుని వెళ్లాడని తెలిపారు.