వైఎస్సార్ బీమా మిత్రల ధర్నా
ABN , First Publish Date - 2021-08-30T20:34:46+05:30 IST
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చలేదని, ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదంటూ ...
విజయవాడ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చలేదని, ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదంటూ వైఎస్సార్ బీమా మిత్రలు విజయవాడలో ధర్నాకు దిగారు. బీమా సొమ్ము, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా ప్రీమియం ఇవ్వకపోవడం, చనిపోయినవారికి డబ్బులు చెల్లించకపోవడంతో ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందని వారు చెప్పారు. దీనికి సంబంధించి అధికారులను కలిసినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారంటే.. ఉద్యోగాల నుంచి ఎవరినీ తొలగించమని, మాట తప్పం.. మడమ తిప్పమని.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారన్నారు. బీమా మిత్రలో పనిచేస్తున్న అందరు మహిళలేనని, 12 ఏళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. తమ నోట్లో మట్టి కొట్టవద్దని కోరారు. ఇవాళ జగన్ ప్రభుత్వం 1350 మంది మహిళలను రోడ్డున పడేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.