విశాఖలో ‘భోపాల్‌’

ABN , First Publish Date - 2020-05-08T08:52:58+05:30 IST

విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుండి స్టైరీన్‌ విషవాయువు లీకైన ఘటన మనసు కలిచివేస్తున్నది. కరోనా కష్టంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలపై ఇది మరో అశనిపాతం...

విశాఖలో ‘భోపాల్‌’

విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుండి స్టైరీన్‌ విషవాయువు లీకైన ఘటన మనసు కలిచివేస్తున్నది. కరోనా కష్టంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలపై ఇది మరో అశనిపాతం. ఘటన తెల్లవారుజామున జరగడంతో సమీప గ్రామాల్లో గాఢనిద్రలో ఉన్నవారికి ముప్పు ఏమిటన్నది అర్థం కాకుండా పోయింది. విషవాయువు ప్రభావంతో ఉక్కిరిబిక్కిరవుతూ రోడ్లమీదకు పరుగెత్తుకొచ్చి వారంతా కుప్పకూలిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఇళ్ళనుంచి వందలాదిమందిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. పిల్లలను, వృద్ధులను మోసుకుపోతున్న వాళ్ళు, ఆ వేదన రోదనల మధ్యనే తమకుటుంబీకులను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారితో ఈ విషాద దృశ్యాలు అనేకులకు కంటతడిపెట్టించాయి. ఐదుకిలోమీటర్ల మేరకు విస్తరించిన ఆ విషం మనుషులనే కాదు, అమాయక పశుపక్ష్యాదులనూ పొట్టనబెట్టుకుంది. పచ్చనిచెట్లు సైతం మాడిమసై మెడలు వాల్చేసిన భయానకమైన ఘటన ఇది.


పరామర్శలు, రాజకీయ విమర్శలూ ప్రతివిమర్శలూ, కుట్రసిద్ధాంతాలను అటుంచితే, విశాఖను కుదిపేసిన ఈ మహా విషాదంలో నిజాన్ని నిగ్గుతేల్చడం ముఖ్యం. ఒక భయానకమైన విషవాయువును పొట్టనిండా దాచుకున్న కంపెనీ ఇంతటి బాధ్యతారాహిత్యంతో ఎలా ఉండగలిగిందో, అందుకు కారకులెవరో తేల్చాలి. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రకటించే విచారణ కమిటీలు ప్రజాగ్రహాన్ని తాత్కాలికంగా ఉపశమింపచేయడానికి తప్ప తప్పుతేల్చడానికి ఉపకరించవని తెలిసిందే. కొందరిని చంపి, వందలమందిని ఆస్పత్రుల పాల్జేసిన ఈ విషవాయువు తక్షణ ప్రభావం మాత్రమే మనం ఇప్పుడు చూశాం. కళ్ళమంటలు, చర్మంపై దురదలు, శ్వాస సమస్యల వంటి తాత్కాలిక లక్షణాలను అటుంచితే, ఈ వాయువు మనిషిపై చూపే దీర్ఘకాలిక ప్రభావం తీవ్రమైనది. ప్రాణవాయువుతో కలిసినందున స్టైరీన్‌ మరింత ప్రమాదకర రూపాన్ని సంతరించుకొని, వారాలపాటు గాలిలోనే ఉండిపోతుందన్న విశ్లేషణలు భయపెడుతున్నాయి.


ఇంతటిదారుణం జరిగిన తరువాత సదరు సంస్థ ప్రతినిధులు కానీ, వారిని సమర్థించుకొచ్చే పాలకులు కానీ అంతా నిజమే చెబుతారని అనుకోవడం అమాయకత్వం. ద్రవరూపంలో ట్యాంకుల్లో భద్రంగా ఉండాల్సిన స్టైరీన్‌ అకస్మాత్తుగా వాయువుగా మారి వెలుపలకు వచ్చి విషం కక్కిందంటేనే నిర్దిష్ట ఉష్ణోగ్రతలో దానిని భద్రపరచాలన్న నియమం అమలు జరగనట్టే. లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలం ఈ ప్లాంట్‌ పనిచేయనప్పటికీ, నిబంధనల ప్రకారం రోజువారీ తనిఖీలు, మెయింటెనెన్స్‌ జరగాల్సిందే. కానీ, అవేమీ సక్రమంగా పాటించలేదు. స్టైరీన్‌ను నిల్వ ఉంచిన కంటైనర్లు పాతవికావడం, వాటినీ సరిగా నిర్వహించకపోవడం, ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ‘అతి హానికర విషవాయువు’తో నిత్యమూ వ్యవహరించే కంపెనీలో కీలకమైన వీవోసీ వ్యవస్థ పనిచేయని స్థితిలో ఉండటం ఆశ్చర్యం. స్టైరీన్‌ స్థితిని ఎప్పటికప్పుడు తెలియచెప్పే ప్రత్యేక వ్యవస్థ లేనందునే, లీకేజీని తక్షణమే గుర్తించక వాయువు ఇలా వేగంగా విస్తరించగలిగింది.


దశాబ్దాల తరువాత భోపాల్‌ విషవాయు ఘటనను మరోమారు మనకు గుర్తుచేసిన ఈ ప్రమాదంలో కంపెనీ నిర్లక్ష్యం అణువణువునా కనిపిస్తున్నది. సడలింపులను అందిపుచ్చుకొని తిరిగి తెరిచేందుకు ఉత్సాహపడుతున్నవారు, లాక్‌డౌన్‌ కాలంలో తాము నిర్వహణలో చూపిన నిర్లక్ష్యాన్ని ముందుగా సవరించుకోలేదు. వాయువు లీకైన గంటకు కానీ లీకేజీని గుర్తించలేకపోవడం, అక్కడున్న కొద్దిమందికీ ఏం చేయాలో తోచక చేతులెత్తేయడం, నివారణ చెప్పగల నిపుణులెవ్వరూ లేకపోవడం, అనేక గంటలపాటు ఆ విష వాయువు సమీప ప్రాంతాలను చుట్టుముట్టడం వరుస తప్పిదాలకు నిదర్శనం. లాక్‌డౌన్‌ కారణంగా మూతబడిన కంపెనీలన్నీ రక్షణచర్యలు కొనసాగిస్తున్నదీ లేనిదీ కనిపెట్టాల్సిన వివిధ శాఖల అధికారులు ఇది బడా కంపెనీ కావడంతో దీని జోలికి వచ్చివుండరు. ఈ కాలుష్యకారక కంపెనీని మూసివేయాలని ఎంతోకాలంగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ పాలకులకు పట్టకపోగా, విస్తరణకు సైతం అనుమతులు ఇస్తున్నారు.


లాక్‌డౌన్‌ కాలంలోనూ ‘అత్యవ సర పరిశ్రమ’గా గుర్తించి పనిచేయనిస్తున్నారు. కంపెనీ యజమానులకు, అధికారులకు, పాలకులకు మధ్య ఉన్న అనుబంధాలు, అవగాహనల వల్లే ఒక విదేశీ కంపెనీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను బలితీసుకోగలిగింది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ పేరిట ప్రభుత్వాలే అన్ని నిబంధనలనూ నీరసపరుస్తున్న కాలం ఇది. కరోనా కారణంగా చైనా నుంచి తరలిపోతున్న కంపెనీలకు ఘనస్వాగతం పలకండి అంటూ రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఉద్బోధించిన నేపథ్యంలో, మరిన్ని మినహాయింపులతో ఈ దేశంలోకి అడుగుపెట్టే కంపెనీలతో రాబోయే కాలంలో ఎన్ని విషాదాలు చవిచూడాల్సి వస్తుందో తెలియదు.

Updated Date - 2020-05-08T08:52:58+05:30 IST