గాయాలతో ఐపీఎల్ నుంచి భువీ, మిశ్రా అవుట్
ABN , First Publish Date - 2020-10-06T08:59:29+05:30 IST
సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగారు.
భువనేశ్వర్ ఆసీస్ టూర్కూ దూరం!
దుబాయ్: సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగారు. ఇక.. భువీ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన మిశ్రాకు ఉంగరం వేలు విరిగింది. ఇక ఈనెల 2న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ ఆటగాడు భువనేశ్వర్కు తొడ కండర గాయమైంది. 30 ఏళ్ల భువీ గాయం తీవ్రత విషయమై స్పష్టమైన సమాచారం లేకున్నా..అది పూర్తిగా మానేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు పట్టవచ్చని తెలుస్తోంది. ‘తొడ కండర గాయంతో ఐపీఎల్ నుంచి భువనేశ్వర్ తప్పుకొన్నాడు. దాన్ని గ్రేడ్-2 లేదా మూడో స్థాయి గాయంగా అంచనా వేస్తున్నాం. దాంతో అతడు దాదాపు రెండు నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది.
ఫలితంగా ఆసీ్సతో సిరీ్సకు కూడా భువీ అందుబాటులో లేనట్టే’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బీసీసీఐ వైద్య బృందంలో సభ్యుడైన టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ యూఏఈలోనే ఉండడంతో.. భువనేశ్వర్ ఇక్కడే ఉండనున్నాడు. సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటరైనందున భువీ పునరావాసాన్ని పూర్తిగా బోర్డే చూసుకోనుంది. పక్కటెముకలు, కాలి పిక్క కండర గాయాలతో గత ఏడాదిగా క్రికెట్కు దూరంగా ఉంటున్న భువనేశ్వర్ ఐపీఎల్తోనే పునరాగమనం చేయడం గమనార్హం.