బైడెన్ బృందంలోని ఇద్దరు భారతీయ మహిళలకు పదోన్నతి!
ABN , First Publish Date - 2021-04-15T14:07:01+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పరిపాలన విభాగంలో 50 మందికి పైగా భారతీయ అమెరికన్లకు కీలక పదవులు అప్పగించిన విషయం తెలిసిందే.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పరిపాలన విభాగంలో 50 మందికి పైగా భారతీయ అమెరికన్లకు కీలక పదవులు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా తన బృందంలోని ఇద్దరు భారత సంతతి మహిళలకు బైడెన్ పదోన్నతి కల్పించారు. మీరా జోషిని రవాణా శాఖలోని ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిపానాధికారిణిగా నామినేట్ చేశారు. అలాగే రాధిక ఫాక్స్ను నీరు, పర్యావరణ పరిరక్షణ సంస్థ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్గా నామినేట్ చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. వీరిద్దరూ జనవరి 20న బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చేరగా, కేవలం మూడు నెలల వ్యవధిలోనే పదోన్నతి పొందడం విశేషం. కాగా, మీరా జోషి ఇంతకుముందు న్యూయార్క్ నగరం డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ విధులు నిర్వహించగా.. రాధిక ఫాక్స్ యూఎస్ వాటర్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. అలాగే జోషికి వివిధ ప్రభుత్వ శాఖలలో అటార్నీగా పనిచేసిన 16 ఏళ్లకు పైగా అనుభవం కూడా ఉంది.
ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో పుట్టి పెరిగిన జోషి.. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి బీఏ, జేడీ పట్టాలు పొందారు. ఇక రాధిక ఫాక్స్.. శాన్ఫ్రాన్సిస్కో పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2.6 మిలియన్ల మంది బే ఏరియా నివాసితులకు 24/7 నీరు, మున్సిపల్ పవర్ సర్వీసెస్ అందించడంలో రాధిక కీలకంగా వ్యవహరించారు. అలాగే పాలసీ లింక్లో ఫెడరల్ పాలసీ డైరెక్టర్గా పనిచేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి సిటీ మరియు రీజినల్ ప్లానింగ్లో మాస్టర్స్ చేశారు.