ఇరాన్ చర్యతో భారత్‌కు భారీ నష్టం : కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-07-14T21:23:38+05:30 IST

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ దౌత్య పటిమను కాంగ్రెస్

ఇరాన్ చర్యతో భారత్‌కు భారీ నష్టం : కాంగ్రెస్

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ దౌత్య పటిమను కాంగ్రెస్ మంగళవారం నిలదీసింది. చాబహార్ పోర్ట్ రైల్ ప్రాజెక్టును భారత దేశం ప్రమేయం లేకుండా తానే స్వంతంగా నిర్మించాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు వెలువడిన పత్రికా కథనాలపై కాంగ్రెస్ స్పందించింది. భారత దేశం నిధులను అందజేయడంలో ఆలస్యం చేస్తున్నందువల్ల తానే స్వయంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఇరాన్ నిర్ణయించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 


కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి మంగళవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘చాబహార్ పోర్టు డీల్ నుంచి భారత దేశాన్ని వదిలేశారు. పని చేయకపోయినా ప్రశంసలందుకున్నటువంటి మోదీ ప్రభుత్వ దౌత్యం ఇది, చైనా ప్రశాంతంగా పని చేసింది, వాళ్లకి మంచి డీల్ దక్కింది. భారత దేశానికి భారీ నష్టం. అయినా మీరు ప్రశ్నించకూడదు’’ అని పేర్కొన్నారు. 


ఓ ఆంగ్ల పత్రికలో వెలువడిన కథనం ప్రకారం, చాబహార్ పోర్టు రైల్ ప్రాజెక్టును ఇరాన్ స్వయంగా చేపట్టాలని నిర్ణయించుకుంది. చాబహార్ పోర్టు నుంచి జహెదాన్ వరకు రైల్వే లైనును నిర్మించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల వెంబడి ఈ రైల్వే లైను వేయాలని ప్రణాళికలు రచించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి అవసరమైన నిధులను భారత ప్రభుత్వం అందజేయడం లేదని చెప్తూ, ఇరాన్ స్వయంగా ఈ రైల్వే లైన్‌ను నిర్మించాలని నిర్ణయించుకుందని ఆ పత్రికా కథనం పేర్కొంది. 


ఈ ప్రాజెక్టుతోపాటు చాబహార్ పోర్టులో కూడా అత్యధిక పాత్ర పోషించే విధంగా ఇరాన్‌తో చైనా ఓ ఒప్పందం కుదుర్చుకుందని ఆ కథనం తెలిపింది. దాదాపు 400 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం ఇరాన్-చైనా మధ్య కుదిరినట్లు పేర్కొంది. 


పాకిస్థాన్‌లోని గదర్ నౌకాశ్రయానికి పశ్చిమ దిశలో 72 కిలోమీటర్ల దూరంలో చాబహార్ పోర్టు ఉంది. ఇది భారత దేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా చాలా కీలకమైనది. ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు కోసం నాలుగేళ్ళ క్రితం ఇరాన్, భారత దేశం మధ్య ఒప్పందం కుదిరింది. 


Updated Date - 2020-07-14T21:23:38+05:30 IST