రాష్ట్రం మారినా సేవ ఆగలేదు
ABN , First Publish Date - 2021-05-18T05:36:30+05:30 IST
సేవ చేసేందుకు సరిహద్దులు, భాష, మతం ఏమీ అడ్డుకాదు. సామాజిక స్పృహ, సేవా భావం ఉంటే చాలని నిరూపిస్తున్నాడు అశ్వారావుపేట మండలం, తిరుమలకుంటకు చెందిన యువకుడు కొనకళ్ల సత్యనారాయణ.
బీహార్ వాసులకు అశ్వారావుపేట వాసి అండ
కరోనా సమయంలో మృతులకు అంత్యక్రియలు: రోగులకు భరోసా
అశ్వారావుపేట, మే 17: సేవ చేసేందుకు సరిహద్దులు, భాష, మతం ఏమీ అడ్డుకాదు. సామాజిక స్పృహ, సేవా భావం ఉంటే చాలని నిరూపిస్తున్నాడు అశ్వారావుపేట మండలం, తిరుమలకుంటకు చెందిన యువకుడు కొనకళ్ల సత్యనారాయణ. పేద కుటుంబంలో జన్మించిన సత్యనారాయణ ఆరంభం నుంచి సేవాభావం కలిగి ఉండేవారు. ఆటో తోలుకుంటూ పేదలకు, వృద్ధులు, వికలాంగులను ఉచితంగా తీసుకెళుతుండేవాడు. ఆ తరువాత మెఘా ఇంజనీరింగ్ కంపెనీలు ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం బీహార్లోని నలంద జిల్లా బావపురి వద్ద ఉన్న మెఘా ఇంజనీరింగ్ క్యాంపస్లో ఉద్యోగం నిమిత్తం వెళ్లి కొవిడ్ సమయంలో రోగులకు అనేక సేవలు అందజేస్తున్నారు. కొవిడ్ మృతదేహాలకు స్వయంగా దహన సంస్కారాలు చేస్తూ సేవలకు సరిహద్దుల్లేవని నిరూపిస్తున్నాడు.
కొవిడ్ రోగులకు విస్తృత సేవలు
కొనకళ్ల సత్యనారాయణ బీహార్లో మెఘా ఇంజనీరింగ్ క్యాంపుతో పాటు గ్రామంలోని కొవిడ్ పాజిటివ్ వచ్చిన రోగుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పడం, వ్యాయామం, మందులు ఎలా వాడాలో చెబుతున్నాడు. ప్రతీ రోజు రోగులకు అవసరమైన మందులు, ఆహార పదార్ధాలు, పండ్లు, డ్రైప్రూట్స్ను కంపెనీ, దాతల సహకారంతో అందజేస్తున్నాడు. ఫోన్లో రోగులతో మాట్లాడుతూ ధైర్యం నింపుతున్నాడు. కొవిడ్తో మృతి చెందిన రోగులకు దహనసంస్కారాలు నిర్వహించాడు. పరిస్థితి విషమించిన రోగులను ఆయనే పీపీటీ కిట్లు ధరించి స్వయంగా ఆసుపత్రికి తరలించి సేవాతత్పరతను చాటుకున్నాడు.
స్వగ్రామంలోనూ సేవలు
సేవాభావంతో పాటు దేశభక్తి కలిగిన సత్యనారాయణ స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో స్వగ్రామమైన తిరుమలకుంట పరిసరాల్లో ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాడు. కొవిడ్ సమయంలో కష్టపడిన పారిశుధ్య సిబ్బందికి సన్మానం చేశారు. ఈ ఏడాది కూడా గ్రామ పంచాయతీకి అవసరమైన పీపీటీ కిట్లను అందజేశారు.