బీహార్‌లో మధ్యంతర ఎన్నికలు: చిరాగ్ జోస్యం

ABN , First Publish Date - 2021-11-14T18:19:46+05:30 IST

బీహార్‌లో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చని లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్..

బీహార్‌లో మధ్యంతర ఎన్నికలు: చిరాగ్ జోస్యం

పాట్నా: బీహార్‌లో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చని లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. పొత్తులతో తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని ఆయన చెప్పారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మధ్యంతర ఎన్ని వస్తాయని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. కలిసివచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని, అయితే ఏ పార్టీలతో పొత్తు అనేది ఎన్నికలకు ముందు మాత్రమే ప్రకటిస్తామని  తెలిపారు.


రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చిరాగ్ పాశ్వాన్ తప్పుపట్టారు. కల్తీ మద్యం రాకెట్‌లో రాష్ట్రంలోని ఉన్నతాధికారుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. బీహార్‌లో ఇప్పటికీ ప్రజలకు మద్యం ఎలా దొరుకుతోందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. అయితే దీనికి నితీష్ సమాధానం ఇవ్వరనే విషయం తనకు తెలుసునని పేర్కొన్నారు. కల్తీ మద్యం రాకెట్‌లో అధికారుల పాత్ర ఉన్నప్పటికీ ఆ అధికారుల ద్వారానే  ప్రభుత్వాన్ని నితీష్ నడుపుతుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.


లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) రెండు వర్గాలుగా చీలిపోక ముందు 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఎల్‌జేపీ కేవలం ఒక్క సీటు గెలుచుకుంది. మొత్తం 243 సీట్లలో ఎన్డీయే 125 సీట్ల మెజారిటీ సాధించింది. బీజేపీ 74, జేడీయూ 43, ఎన్డీయేకు చెందిన మరో రెండు భాగస్వామ్య పార్టీలు 8 సీట్లు గెలుచుకున్నాయి. ఆర్జేడీ 75 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి కేవలం 19 సీట్లలో గెలుపొందింది. చిరాగ్ పాశ్వాన్‌కు, ఆయన అంకుల్ పశుపతి కుమార్ పరస్‌కు మధ్య ఎల్‌జీపీపై పెత్తనం విషయంలో విభేదాలు తలెత్తడంతో గత నెలలో ఎన్నికల కిమిషన్ వీరిద్దరికీ వేర్వేరు పార్టీ పేర్లు, గుర్తులు కేటాయించింది. చిరాగ్ పాశ్వాన్‌కు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పేరును, ఎన్నికల గుర్తుగా హెలికాప్టర్‌ను కేటాయించింది. పశుపతి కుమార్ పరస్‌కు 'రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ' పేరు, ఎన్నికల గుర్తుగా కుట్టు మిషన్ కేటాయించింది.

Updated Date - 2021-11-14T18:19:46+05:30 IST