కోవిషీల్డ్, కోవాగ్జిన్.. రెండింటినీ ఐదు నిమిషాల గ్యాప్‌లో ఆ మహిళకు ఇచ్చేశారు.. చివరకు..

ABN , First Publish Date - 2021-06-18T23:08:45+05:30 IST

తాజాగా బీహార్‌లో ఓ 63 ఏళ్ల మహిళ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకుంది.

కోవిషీల్డ్, కోవాగ్జిన్.. రెండింటినీ ఐదు నిమిషాల గ్యాప్‌లో ఆ మహిళకు ఇచ్చేశారు.. చివరకు..

ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా బీహార్‌లో ఓ 63 ఏళ్ల మహిళ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకుంది. విషయం తెలియడంతో ఆమెను వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. 


పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌కు చెందిన సునీలా దేవి వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చింది. అక్కడ రెండు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక దగ్గర కోవాగ్జిన్, మరో దగ్గర కోవిషిల్డ్ టీకాలు వేస్తున్నారు. సునీలా దేవి మొదట ఒక లైన్లో నిల్చుని కోవాగ్జిన్ టీకా తీసుకుంది. అనంతరం మరో టీకా కూడా తీసుకోవాలేమో అనుకుని రెండో లైన్లో కూడా నిల్చుంది. నర్సులు ఎలాంటి ప్రశ్నలూ వేయకుండానే ఆమెకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేసేశారు. అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్థులు వ్యాక్సినేషన్ సెంటర్ ముందు ధర్నా చేశారు. 


విషయం తెలియడంతో జిల్లా ఆరోగ్య అధికారి.. సిబ్బందితో కలిసి ఆ మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. అయినప్పటికీ ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులకు హెల్త్ ఆఫీసర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

Updated Date - 2021-06-18T23:08:45+05:30 IST