దీపావళిని సెలవుగా ప్రకటించాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు!
ABN , First Publish Date - 2021-11-04T23:12:11+05:30 IST
సనాతన హైందవ సంప్రదాయానికి ప్రతీక అయిన దీపావళిని అమెరికాలోనూ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ సభ్యురాలు కెరోలిన్ బీ మహోనీ ప్రతినిధుల సభలో ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్: సనాతన హైందవ సంప్రదాయానికి ప్రతీక అయిన దీపావళిని అమెరికాలోనూ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ సభ్యురాలు కెరోలిన్ బీ మహోనీ ప్రతినిధుల సభలో ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సభలోని విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్పర్సన్ గ్రెగరీ మీక్స్తో కలిసి ఈ బిల్లును ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్న అశేష ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపిన ఆమె..ఈ పండగను చీకటిపై వెలుతురు సాధించిన విజయంగా అభివర్ణించారు. ఈ బిల్లును ప్రతిపాదించడం తనకు ఎంతో గర్వకారణమని మహోనీ పేర్కొన్నారు. భారత సంతతి వారు అమెరికా అభ్యున్నతికి చేసిన కృషికి ఈ బిల్లు ఓ గుర్తింపని కూడా మహోనీ తెలిపారు. అమెరికాలో భావితరాలు ఈ పండుగ జరుపుకునేలా బిల్లుకు చట్ట రూపం ఇవ్వాలంటూ అమెరికా కాంగ్రెస్, సెనెట్ సభ్యులను కోరారు. కాగా.. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే..ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు, శాఖలు దీపావళి రోజును సెలవుగా ప్రకటించే అవకాశం ఉంటుంది.