కేరళలో వెలుగుచూసిన Bird flu...కోళ్లు, బాతులను చంపాలని ఆదేశం
ABN , First Publish Date - 2021-12-10T15:47:05+05:30 IST
కేరళ రాష్ట్రంలోని కుట్టనాడ్ ప్రాంతంలో తాజాగా బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి...
రంగంలో దిగిన ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కుట్టనాడ్ ప్రాంతంలో తాజాగా బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. అల్లపుజాలోని కుట్టనాడ్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ తాజాగా వెలుగుచూసిన బర్డ్ ఫ్లూ కేసులను అధికారులు ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్లు, బాతులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నిరోధించేందుకు అధికారులు కోళ్లు, బాతులను చంపేందుకు వీలుగా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.అలప్పుజా జిల్లాలోని తకజీ పంచాయతీ కుట్టనాడ్ ప్రాంతంలో ఒక రైతు పెంచిన వేలాది బాతులు చనిపోయాయి. మరణించిన బాతుల శాంపిళ్లను భోపాల్ నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్కు పంపించగా బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు.
సరిహద్దు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతంలోని కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, గుడ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది కేరళలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం ఇది రెండోసారి. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కేరళ రాష్ట్రంలో కలకలం రేగింది.