బిట్‌కాయిన్ కుంభకోణం : కాంగ్రెస్‌కు కర్ణాటక సీఎం సవాల్

ABN , First Publish Date - 2021-11-14T22:38:19+05:30 IST

బిట్‌కాయిన్ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారి పేర్లను

బిట్‌కాయిన్ కుంభకోణం : కాంగ్రెస్‌కు కర్ణాటక సీఎం సవాల్

బెంగళూరు : బిట్‌కాయిన్ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారి పేర్లను బయటపెట్టాలని కాంగ్రెస్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ సవాల్ చేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారిని వదులుకోవడానికి తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిలో రెండో ఆలోచన లేదని, నిర్దయగా చర్య తీసుకుంటామని చెప్పారు. 


బొమ్మయ్ ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ, బిట్‌కాయిన్ కుంభకోణంతో కొందరు పలుకుబడిగలవారికి ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. ఆ పలుకుబడిగల వ్యక్తుల పేర్లు తెలిస్తే చెప్పాలని సవాల్ చేశారు. వారి పేర్లు చెబితే తాము వెంటనే దర్యాప్తు చేస్తామని, రెండో ఆలోచనే ఉండదని అన్నారు. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారు దేశంలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, వారిపై నిర్దయగా చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ కుంభకోణాన్ని బయటపెట్టినదే తాము అని చెప్పారు. తాము ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారిని ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధమని తెలిపారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పాత్రను మరుగుపరచేందుకు ఎక్కడాలేనివారి పేర్లను చెప్తోందన్నారు. హ్యాకర్ శ్రీకృష్ణను తన ప్రభుత్వం అరెస్టు చేసి, దర్యాప్తు జరుపుతోందని, 2018లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఆయనను వదిలిపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జీవాలా చేసిన ఆరోపణలపై బొమ్మయ్ ఈ విధంగా స్పందించారు. 


సుర్జీవాలా శనివారం ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బిట్‌కాయిన్ కుంభకోణం విలువ చాలా ఎక్కువగా ఉండవచ్చునన్నారు. 2020 డిసెంబరు 1, 2021 ఏప్రిల్ 14 తేదీల్లో జరిగిన చట్టవిరుద్ధ లావాదేవీల విలువ రూ.5,240 కోట్లు అని ఆరోపించారు. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ పాత్ర ఏమిటో చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సవాల్ చేశారు. ఈ కుంభకోణం జరిగిన సమయంలో బొమ్మయ్ కర్ణాటక హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతిని గుర్తు చేశారు. 


Updated Date - 2021-11-14T22:38:19+05:30 IST