సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యే విమర్శలు

ABN , First Publish Date - 2021-10-28T01:47:55+05:30 IST

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఆయన

సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యే విమర్శలు

భువనేశ్వర్ : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే సౌమ్య రంజన్ పట్నాయక్ విమర్శలు గుప్పించారు. నవీన్ పరిపాలించిన తొలి దశాబ్దంలో నేరాలు, అవినీతిని సహించలేదని, ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఒడియా పత్రికలో రాసిన వ్యాసంలో దుయ్యబట్టారు. 


ఒడిశాలోని కలహండి జిల్లాలో ఓ టీచర్‌ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితునితో రాష్ట్ర హోం మంత్రి దిబ్య శంకర్ మిశ్రా సన్నిహితంగా ఉన్నారని ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ వివాదంపై నవీన్ పట్నాయక్ స్పందించలేకపోతున్నారని సౌమ్యరంజన్ ఒడియా దినపత్రిక సంబాద్‌ మొదటి పేజీలో ప్రచురితమైన వ్యాసంలో రాశారు. ప్రజా జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. తగిన రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల బీజేడీ ఓ దశాబ్దానికి పైగా అధికారంలో కొనసాగుతోందని, ప్రస్తుతం అహంకారం అధికారం చలాయిస్తోందని పేర్కొన్నారు. సౌమ్య రంజన్ ఈ పత్రికకు ఎడిటర్‌ అనే విషయం గమనార్హం. 


టీచర్ హత్య కేసులో నిందితుడు గోబింద్ సాహుతో సన్నిహితంగా ఉన్న హోం మంత్రి దిబ్య శంకర్‌ను పదవి నుంచి తొలగించాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. ఈ వివాదంపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇప్పటికీ స్పందించలేదు. 


సాహు నడుపుతున్న పాఠశాలలో పని చేస్తున్న టీచర్ మమిత మెహర్ (26)ను ఆయన తన కారులోనే హత్య చేసినట్లు పోలీసులు ఆరోపించారు. కలహండి జిల్లాలో అక్టోబరు 8న ఈ దారుణం జరిగినట్లు తెలిపారు. సాహు అక్రమాలను బయటపెడతానని ఆమె హెచ్చరించడంతో ఆయన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆమెను కారులోనే హత్య చేసి, ముక్కలుగా కోసి, తన పాఠశాల సమీపంలోని నిర్మాణంలో ఉన్న స్టేడియంలో పూడ్చిపెట్టారని పేర్కొన్నారు. ఆయనను అక్టోబరు 19న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. 


Updated Date - 2021-10-28T01:47:55+05:30 IST