మమత నామినేషన్‌పై ప్రియాంక టిబ్రెవాల్ అభ్యంతరం

ABN , First Publish Date - 2021-09-14T21:45:40+05:30 IST

పశ్చిమబెంగాల్‌లోని భవనాపూర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ..

మమత నామినేషన్‌పై ప్రియాంక టిబ్రెవాల్ అభ్యంతరం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవనాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్‌పై  బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రెవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు భవానీ‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ప్రియాంక ఎలక్షన్ ఏజెంటు సజల్ ఘోష్ లేఖ రాశారు. తనపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసులను వెల్లడించడంలో మమత విఫలమయ్యారంటూ ఆ లేఖలో ఘోష్ అభ్యంతరం లేవనెత్తారు. మమతా బెనర్జీపై ఉన్న క్రిమినల్ కేసులపై‌ వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను లేఖలో ఆయన ప్రస్తావించారు.


కాగా, భవనాపూర్ నియోజకవర్గం నుంచి ప్రియాంక టిబ్రెవాల్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికలు అన్యాయంపై జరిపే పోరాటంగా ఆమె అభివర్ణించారు. మమతకు పోటీగా తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఈనెల 8న కాంగ్రెస్ ప్రకటించడంతో ప్రధాన పోటీ మమత, టిబ్రేవాల్ మధ్యే నెలకొంది. సెప్టెంబర్ 30న ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2021-09-14T21:45:40+05:30 IST