విధి నిర్వహణలో గైనిక్ వైద్యులు నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2021-06-23T05:15:41+05:30 IST
ప్రాంతీయ ఆస్పత్రిలో గైనికాలజిస్టులు సరిగా విధులు నిర్వహించడంలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గాదె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత డిమాండ్
నర్సీపట్నం, జూన్ 22: ప్రాంతీయ ఆస్పత్రిలో గైనికాలజిస్టులు సరిగా విధులు నిర్వహించడంలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గాదె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ నెల 16వ తేదీ రాత్రి కోట భవాని పురుడుపోసుకోవడానికి ప్రాంతీయ ఆస్పత్రికి వెళ్లగా... ఈ సమయంలో డెలివరీ చేయలేమని పంపించేశారని, ఆమె ఒక స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా సాధారణ ప్రసవం అయ్యిందని చెప్పారు. అదే విధంగా 21వ తేదీన బలిజపాలెం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి పురుడు కోసం రాగా.. బిడ్డ అడ్డం తిరిగిందంటూ విశాఖపట్నం కేజీహెచ్కు రిఫర్ చేశారని, కానీ ఆమెను కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా సుఖ ప్రసవం అయ్యిందని తెలిపారు. ప్రాంతీయ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గైనికాలజిస్టులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇన్చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్కి మంగళవారం ఫిర్యాదు చేశారు.