చావనైన చస్తాను.. కేసీఆర్కు లొంగను: ఈటల
ABN , First Publish Date - 2021-10-14T08:47:19+05:30 IST
‘నా వెంట ఉన్న నాయకులను కొనుగోలు చేసినా.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదుర్కొనే సత్తా ఉంది. అవసరమైతే..
జమ్మికుంట, అక్టోబరు 13: ‘నా వెంట ఉన్న నాయకులను కొనుగోలు చేసినా.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదుర్కొనే సత్తా ఉంది. అవసరమైతే చావనైనా చస్తాను కానీ సీఎం కేసీఆర్కు లొంగను. సిద్దిపేట, గజ్వేల్ ప్రజలు కేసీఆర్ను ఎలా ప్రేమిస్తున్నారో.. నా నియోజక వర్గ ప్రజలు నన్ను అదేవిధంగా ప్రేమిసారు. మీ అమ్మ మీకు ఎంత గొప్పదో.. మా అమ్మ మాకు అంతే గొప్పది’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.
హుజూరాబాద్లో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు 300 కోట్లు ఖర్చు చేశారని, ఇంకా వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అహంకారం మీద దెబ్బ కొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసే ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అనగానే ముస్లింలకు వ్యతిరేకమని అంటారని, కానీ మంచిర్యాలకు చెందిన సభాని అనే వ్యక్తి సైకిల్కు జెండా కట్టుకుని ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తున్నాడని చెప్పారు.