జీహెచ్ఎంసీ ఫలితాలు...టీఆర్ఎస్‌కు చెంపపెట్టు: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-12-04T16:41:14+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధిక్యంలో దూసుకుపోవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీ ఫలితాలు...టీఆర్ఎస్‌కు చెంపపెట్టు: బండి సంజయ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధిక్యంలో దూసుకుపోవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తునే పరిగణలోకి తీసుకోవాలంటూ ఆదేశించిన హైకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఓటర్ల విశ్వాసాన్ని నిలపెట్టిన కోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ పడిందని...ఇప్పటికైనా కొంచమైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎన్నిసార్లు కోర్టు మొట్టియాలు వేసిన దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. ఈసీ ,రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని , విశ్వాసాన్ని పెంచిందని బండి సంజయ్ అన్నారు.




జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇది అని ఆనందం వ్యక్తం చేశారు. అడ్డదారుల్లో గెలవాలని చూసిన టీఆర్ఎస్ పార్టీకి ఇది చెంపపెట్టు అని అన్నారు. ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చెయాలని...లేదా ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారని ఆయన హెచ్చరించారు. ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. టీఆర్ఎస్, ఈసీ ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలు అయిందన్నారు. ప్రతీ గంటకు పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ... సాయంత్రం 5 నుంచి 6 వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఎందుకు అప్పటికప్పుడే ప్రకటించలేదని ప్రశ్నించారు. 5 నుండి 6 గంటల వరకు 12% నుండి 18% శాతం ఎలా పెరిగిందనేది హైకోర్టు విచారణ జరపాలన్నారు. కొన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఉన్నట్టుండి 90% శాతానికి పోలింగ్ పెరిగిందని...ఇందులో ఏదో గాంబ్లింగ్ జరిగింది అనే అనుమానం ఉందని, వాటి మీద కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ, ఎక్కడా ఎన్నికలు జరగలేదన్నారు. పెన్నుతో టిక్కులు పెట్టినా పరిగణలోకి తీసుకోవాలంటూ ఈసీ సర్క్యూలర్ విడుదల చెయ్యడం చూస్తుంటే అధికారంపోతుందేమో అన్న ఆకలి, ఆపతి, ఆతృత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని యెద్దేవా చేశారు. ఎన్నికుట్రలు చేసిన బీజేపీ వైపే ప్రజలు ఉన్నారని...టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలే సాక్షాలు అని బండి సంజయ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-04T16:41:14+05:30 IST