ఎన్నికల ప్రచారంలో కుప్పకూలిన బీజేపీ నేత.. మృతి
ABN , First Publish Date - 2020-11-23T00:02:38+05:30 IST
ఎన్నికల ప్రచారం చేస్తూ ఓ బీజేపీ అభ్యర్థి మృతి చెందారు. ప్రచారంలో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే మృతి చెందారు. కేరళలోని కొల్లం జిల్లాలో...
తిరువనంతపురం: ఎన్నికల ప్రచారం చేస్తూ ఓ బీజేపీ అభ్యర్థి మృతి చెందారు. ప్రచారంలో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే మృతి చెందారు. కేరళలోని కొల్లం జిల్లాలో జరిగిందీ ఘటన. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత విశ్వనాథన్ కొల్లం జిల్లాలో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కొల్లం జిల్లాలో పర్యటించారు. క్యాంపెయినింగ్లో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే ఉన్నట్లుండి మైక్ వదిలేసి కుప్పకూలిపోయారు.
వెంటనే పక్కనున్న కార్యకర్తలంతా కలిసి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తలించారు. అయితే విశ్వనాథన్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళా నేత క్యాంపెయినింగ్ సందర్భంగా పక్కనున్న చెట్టు విరిగి పడడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.