ఇసుక వ్యవహారం నిగ్గు తేల్చండి
ABN , First Publish Date - 2020-05-24T10:00:44+05:30 IST
‘ఇసుక వివాదంలో తాడేపల్లి గూడెంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన లోకేశ్ ఉదంతంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి,..
బీజేపీ నేత మాణిక్యాలరావు డిమాండ్
ఏలూరు, మే 23, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఇసుక వివాదంలో తాడేపల్లి గూడెంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన లోకేశ్ ఉదంతంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి, విచారణ జరపాలి. గడిచిన కొద్ది కాలంగా ఇసుక వ్యాపారవస్తువుగా మారింది. ఫలితంగానే వివాదాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారు. తాడే పల్లిగూడెంలో చోటు చేసుకున్న పరిణామాలపై హైకోర్టు విచారిస్తే తప్పని సరిగా నిజాలు బయటపడతాయి’ అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఏలూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాడేపల్లిగూడెంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న తీరును చూసి లోకేశ్ అనే వ్యక్తి ప్రశ్నించి ఆరా తీశాడని, ఈ కారణంగా అతన్ని పోలీసులు వేధించడంతో లోకేశ్ ఆత్మహత్యకు ప్రయత్నించడని మాణిక్యాలరావు అన్నారు. గుంటూరులో 65 ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మపై సీఐడీ కేసు దాఖలు చేయడం అత్యంత దారుణ మని, విశాఖపట్నంలో కరోనా సమస్యలపై ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ను తీవ్రంగా వేధించడమే కాకుండా దుందుడుకుగా వ్యవహరిం చారని దుయ్య బట్టారు. ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతించారు. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఇప్పటికే పూర్తి దెబ్బతగిలిందని దీనిని నుంచి బయటపడేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అన్ని వర్గాలకు కలిసి వచ్చేదిగా అభివర్ణించారు. కొంతమంది కావాలని ప్యాకేజీని విమర్శిస్తున్నారన్నారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితు ల్లో ఆర్థిక పటిష్టతకు ఈ ప్యాకేజీ పూర్తిగా ఉపయోగపడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సుధాకర కృష్ణ, నరసాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, జిల్లా ఉపాఽధ్యక్షుడు విక్రమ్ కిషోర్, తూర్పు మండల అధ్యక్షుడు మనోహర్ ప్రసాద్, సెంట్రల్ మండల అధ్యక్షుడు బాధిత నారాయణ, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శీర్ల భాస్కర్, మాజీ పట్టణ అధ్యక్షుడు నాగం శివ, పార్టీ నేతలు దుర్గారావు, కిలపర్తి రాజశేఖర్, కస్తూరి, అనురాధ పాల్గొన్నారు.