వైసీపీ ఎమ్మెల్యేపై బీజేపీ నాయకుల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-01-29T05:02:00+05:30 IST
బ్యాంకులను బురిడీ కొట్టించిన ఘనత ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిదే అని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కపిలేశ్వరయ్య, కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు రామస్వామి ఆరోపించారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), జనవరి 28: బ్యాంకులను బురిడీ కొట్టించిన ఘనత ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిదే అని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కపిలేశ్వరయ్య, కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు రామస్వామి ఆరోపించారు. శుక్రవారం బుదవారపేటలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వక్ఫ్బోర్డు భూములను కాజేసిన ఘనచరిత్ర ఉందన్నారు. సోమువీర్రాజును వలసపక్షి అని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆత్మకూరులో 144 సెక్షన్ అమలులో ఉందని బీజేపీ నాయకులను ఆపేశారని, మరీ వైసీపీ నాయకులు ఎలా వెళ్లగలిగారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏయేమి అభివృద్ధి చేపట్టిందో చెప్పగలరా అని సవాల్ విసిరారు. 2019 ఎన్నికల సందర్భంగా అభిరుచి మధును హత్య చేయడానికి ప్రయత్నం చేయగా.. కేసు పెట్టడం అబద్ధమా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపైన కేసులు ఉన్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్యాత్మక గ్రామంలో 144 సెక్షన్ విధించినప్పుడు మీరు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, నంద్యాల నుంచి ఎమ్మెల్సీ ఇసాక్, ఉప ముఖ్యమంత్రి ఆంజాద్ బాషా ఆత్మకూరు పిలుపునిచ్చిన విషయం వాస్తవం కాదా అని? ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కాశీవిశ్వనాథ్, కాళింగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు.