ఇరిగేషన్ మంత్రా.. ఇరిటేషన్ మంత్రా?
ABN , First Publish Date - 2022-01-22T04:32:52+05:30 IST
పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రినా లేక ఇరిటేషన్ మంత్రినా అనే అనుమానం వస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ నాయకుడు కర్నాటి
నెల్లూరు (స్టోన్హౌస్పేట), జనవరి 21: పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రినా లేక ఇరిటేషన్ మంత్రినా అనే అనుమానం వస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నెల్లూరులో ప్రముఖ కాంట్రాక్టర్ అయిన గునపాటి మురళీకృష్ణ రెడ్డిని టెండర్లు వేయవద్దని బెదిరించడంపై గత నెల 26వ తేదీన హైదరాబాద్ రాజేంద్రనగర్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూప్కుమార్ యాదవ్ పై కేసు రిజిస్టర్ అయిందన్నారు. అనిల్ వ్యవహారాలు రూప్కుమార్ చూస్తూ ఉంటారని ఆ క్రమంలో రూప్కుమార్ అక్రమాలు, ఆగడాలు హెచ్చమీరిపోతున్నాయని ఆరోపించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సొంత అక్క కొడుకైన గునపాటి మురళీకృష్ణ రెడ్డిని టెండర్లలో పాల్గొనకుండా బెదిరిస్తున్నారంటే వీళ్ల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా, ఉద్యోగుల జీతభత్యాలు పెంచకుండా వారిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ వంశీధర్రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.