రాయలసీమలో బలోపేతంపై నేడు BJP రాష్ట్రస్థాయి సమావేశం

ABN , First Publish Date - 2021-09-05T13:05:32+05:30 IST

రాయలసీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంపై నేడు కర్నూలు జిల్లాలో..

రాయలసీమలో బలోపేతంపై నేడు BJP రాష్ట్రస్థాయి సమావేశం

కర్నూలు : రాయలసీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంపై నేడు కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు శివప్రకాష్‌, దియోధర్‌ హాజరుకానున్నారు. సీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంతో పాటు పలు కీలక విషయాలపై నేడు ముఖ్యనేతలు చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా గత నాలుగైదు రోజులుగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జరుగుతున్న వివాదంపై కూడా చర్చించనున్నారు. మరోవైపు.. బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటు చేయకూడదని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి సూచించారు.


సోషల్ మీడియా పోస్టులపై విచారణ

ఇదిలా ఉంటే.. వినాయక పండుగకు ఆంక్షలు విధించడం సరికాదని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారంటూ ఆదోనికి చెందిన బీజేపీ సానుభూతిపరుడు పవన్‌కుమార్‌ అలియాస్‌ కల్యాణ్‌ను ఆదోని టూటౌన్‌ పోలీసులు శనివారం విచారించారు. తాను ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదని, వినాయక చవితి పండుగను ఎందుకు జరపడం లేదని మాత్రమే ప్రశ్నించానని పవన్‌కుమార్‌ పేర్కొన్నారు. తర్వాత బీజేపీ నాయకులు వెళ్లి పోలీసులతో చర్చించారు. దీంతో విచారణ నిమిత్తం ఆదివారం స్టేషన్‌కు రావాలని పవన్‌కుమార్‌ను పోలీసులు పంపించారు.

Updated Date - 2021-09-05T13:05:32+05:30 IST