నామినేషన్‌‌కు సువేందు వెంట స్మృతి ఇరానీ

ABN , First Publish Date - 2021-03-09T16:33:26+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సువేందు అధికారి నామినేషన్..

నామినేషన్‌‌కు సువేందు వెంట స్మృతి ఇరానీ

నందిగ్రామ్: పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సువేందు అధికారి నామినేషన్ ప్రక్రియను అట్టహాసంగా జరిపేందుకు కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. ఈనెల 12న నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీకి ఆయన నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ రాష్ట్ర నేతలతో పాటు, కేంద్ర మంత్రులు ఒకరిద్దరు కూడా సువేందు వెంట  నామినేషన్‌ ప్రక్రియకు తరలి వెళ్తారు. కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ ఈ నామినేషన్ ఘట్టానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా నందిగ్రామ్ నుంచి భారీ మెజారిటీతో సువేందు అధికారి గెలిచారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఇటీవల టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. నందిగ్రామ్ నుంచే మళ్లీ పోటీకి సిద్ధపడటంతో, అదే నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసి సువేందుకు గట్టి గుణపాఠం చెబుతానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌ నియోజకవర్గం ఇరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. మమతను 50,000 వేల ఆధిక్యంతో ఓడిస్తానంటూ సువేందు ప్రతినబూనారు.

Updated Date - 2021-03-09T16:33:26+05:30 IST