లాక్డౌన్ వేళ ‘మోదీ కిచెన్’.. బీజేపీ ఎమ్మెల్యే వినూత్న ఆలోచన
ABN , First Publish Date - 2020-03-30T17:30:17+05:30 IST
కరోనా సృష్టిస్తున్న భీభత్సం నుంచి దేశ ప్రజలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా...
ముస్సోరీ: లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల బాధను తీర్చాలని ఆ ఎమ్మెల్యే అనుకున్నారు. తన నియోజకవర్గంలోని ప్రతి పేదవాని కడుపు నింపాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఒక ఆలోచన చేశారు. దాని ప్రతి రూపమే ‘ మోదీ కిచెన్’.
కరోనా సృష్టిస్తున్న భీభత్సం నుంచి దేశ ప్రజలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ కారణంగా పేదలు, ముఖ్యంగా రోజువారీ కూలిపై ఆధారపడి జీవనం సాగించేవారు అనేక అగచాట్లు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడం కోసం ఉత్తరాఖండ్లోని ముస్సోరీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి వినూత్న ఆలోచన చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో బాధపడుతున్న పేదల కోసం ‘మోదీ కిచెన్’ పేరుతో భోజనం తయారు చేసి వారికి అందిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు చోట్ల ఈ మోదీ కెచెన్లను జోషి ఏర్పాటు చేశారు. రాజ్పూర్, జఖన్, దాక్రా, దోవల్వాలా ప్రాంతాల్లో ఇవి ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా దాదాపు 500 మందికి భోజనం అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ.. లాక్డౌన్ వల్ల నిర్మాణ రంగంతో పాటు పలు విభాగాల్లో పనులు నిలిపోయాయన్నారు. దీనివల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో రోజువారీ కూలీలు ఆకలితో అలమటిస్తున్నారని, వారి కష్టాన్ని కొంతమేర అయినా తీర్చే ఉద్దేశంతోనే ఈ మోదీ కిచెన్ను ప్రారంభించామని వివరించారు. అనేక చోట్ల ఉన్న పేదలకు ఇక్కడ పనిచేసేవారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి ఆకలిని తీరుస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వీరెవరూ లాక్డౌన్ నిబంధనలను ఏ మాత్రం ఉల్లంఘించడంలేదని జోషి వివరించారు.