ఏపీ పోలీస్ వ్యవస్థపై ఎంపీ సీఎం Ramesh సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-24T16:18:02+05:30 IST

ఏపీలోని పోలీస్ వ్యవస్థపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ పోలీస్ వ్యవస్థపై ఎంపీ సీఎం Ramesh సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ఏపీలోని పోలీస్ వ్యవస్థపై  బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందని స్పష్టం చేశారు. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందని, త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని తెలిపారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని ఎంపీ హితవుపలికారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని.. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామన్నారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28న బీజేపీ సభ నిర్వహిస్తోందని ప్రకటించారు. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. సినిమా రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న ఇంటరెస్ట్.. ప్రజా సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు.


సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే.. హాళ్లను సీజ్ చేయిస్తారా..? అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంతున్నాయి..? అక్కడి విధానం ఏంటో ఓసారి చూడండని సూచించారు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దశలవారీ మద్య నిషేధం కాదని.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్ ప్రభుత్వం  ప్రొత్సహిస్తోందని మండిపడ్డారు. ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్ర నిధులతోనే చేస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే చేపట్టారన్నారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు.. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదని తెలిపారు. రెండున్నరేళ్లల్లో స్టీల్ ఉత్పత్తి చేస్తామన్నారని.. ఏమైనా చేశారా అని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-24T16:18:02+05:30 IST