వాటర్ కెనాన్కు గాయపడి ఆసుపత్రి పాలైన బీజేపీ ఎంపీ
ABN , First Publish Date - 2021-10-12T22:10:23+05:30 IST
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మంగళవారంనాడు స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార ..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మంగళవారంనాడు స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం వెలుపల నిరసన ప్రదర్శన సందర్భంగా వాటర్ కెనాన్ తాకడంతో ఆయన గాయపడ్డారని, దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఛాత్పూజ ఉత్సవాలపై ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఆంక్షలు విధించడంపై నిరసన తెలుపుతూ బీజేపీ నేతలు మంగళవారం ఉదయం కేజ్రీవార్ అధికార నివాసం వద్ద ప్రదర్శన జరిపారు. ప్రదర్శకులను నిలువరించేందుకు వాటర్ కెనాన్ ఉపయోగించారని, అది ఎంపీ మెడను తాకడంతో ఆయన గాయడ్డారని, ప్రస్తుతం సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మనోజ్ తివారీ సన్నిహితుడు ఒకరు తెలిపారు. డీడీఎంఏ ఈ నెల మొదట్లో తాజా కోవిడ్ గైడ్లైన్స్ జారీ చేస్తూ, సిటీలోని బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజ ఉత్సవాలను నిషేధించామని, ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలని పేర్కొంది.