బీజేపీలో రోజురోజుకు పెరుగుతోన్న ఆశావాహుల జాబితా

ABN , First Publish Date - 2021-03-23T00:22:33+05:30 IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి..

బీజేపీలో రోజురోజుకు పెరుగుతోన్న ఆశావాహుల జాబితా

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి.. ముందు వరుసలో నిలిచింది. మంగళవారం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే అధికార టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థి ఎంపిక కాషాయం పార్టీ సాగరమథనం‌ చేస్తోంది. అయినప్పటికీ ఇంకా టికెట్ పంచాయతీ తేలలేదు. నాగార్జున సాగర్ అభ్యర్థిపై కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆ పార్టీలో రోజురోజుకు ఆశావాహుల జాబితా పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న వారిలో కంకణాల నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి, రవీంద్ర నాయక్ తదితరులున్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే తమ అభ్యర్థిని ప్రకటించే యోచనలో కాషాయ పార్టీ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు తెరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డిలపై బీజేపీ నాయకత్వం కన్నేసినట్లు సమాచారం. సాగర్‌లో బీజేపీ ఆశావాహులు పాదయాత్రలు ముమ్మరం చేశారు. మరికొంతమంది పార్టీ అనుమతితోనే వేర్వేరుగా పాదయాత్రలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కాషాయపార్టీలో మేధోమథనం చేస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాల ప్రభావం సాగర్ ఉప ఎన్నికపై ఉండదని కమలనాథులు భావిస్తున్నారు. 


మరోవైపు నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కావడంతో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఈ నెల 30న నామినేషన్‌ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు అప్రమత్తమయ్యారు. సీఎం కేసీఆర్‌, బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికల సభలు పూర్తి చేశారు. తామూ ఈ నెల 27న హాలియాలో సభ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో, నియోజకవర్గంలో చర్చకు తెరలేపాలని జానారెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్‌, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్కలకు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. 

Updated Date - 2021-03-23T00:22:33+05:30 IST