ఈటల ఎందుకు సీఎం కాకూడదు?

ABN , First Publish Date - 2021-01-21T07:16:44+05:30 IST

మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్‌ఎ్‌సలో అణుబాంబు కంటే భారీ పేలుడు జరగడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ..

ఈటల ఎందుకు సీఎం కాకూడదు?

కేటీఆర్‌ను సీఎం చేస్తే..

టీఆర్‌ఎస్‌లో భారీ పేలుడు ఖాయం

కేటీఆర్‌ కోసమే దోషనివారణ పూజలు

ఫాంహౌస్‌లో 3 రోజులు యాగాలు 

యాగ ద్రవ్యాలను త్రివేణి సంగమంలో 

కలిపేందుకే కాళేశ్వరం టూర్‌: సంజయ్‌


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్‌ఎ్‌సలో అణుబాంబు కంటే భారీ పేలుడు జరగడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎందుకు సీఎం చేయకూడదని ప్రశ్నించారు. ‘‘ఈటల ఏం తక్కువ చేశారు? కేటీఆర్‌ ఏం ఎక్కువ చేశారు? సీఎం కుమారుడే సీఎం కావాలా? దళితుడిని సీఎం చేస్తే ఏమవుతుంది? అసలు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్‌ పాత్ర ఏంటి?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు.


అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌ను సీఎంను చేయడానికి కేసీఆర్‌ మూడు రోజులపాటు దోష నివారణ పూజలు చేశారని, ఆ ద్రవ్యాల (వస్తువులు)ను త్రివేణి సంగమంలో కలిపేందుకే కాళేశ్వరం వెళ్లారని అన్నారు. అంతే తప్ప.. ప్రాజెక్టు కోసం కాదని పేర్కొన్నారు. ఫాంహౌ్‌సలో ఈ పూజలు మూడురోజులు జరిగాయని, శృంగేరి నుంచి ప్రత్యేకంగా పూజారులను రప్పించారని తెలిపారు. ఇక సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టుల పేరిట మరో రూ.50 వేల కోట్లు దండుకునేందుకు కొత్త నాటకానికి తెర తీశారని సంజయ్‌ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే 125 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి మట్టిని సేకరిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-01-21T07:16:44+05:30 IST