గొర్రెలు, మేకల్లా ఎమ్మెల్యేలను బీజేపీ కొనేసింది: డీకే

ABN , First Publish Date - 2022-01-29T02:29:40+05:30 IST

గొర్రెలు, మేకల వ్యాపారంలా గోవాలో ఎమ్మెల్యేలను బీజేపీ డబ్బులు ఎరచూపించి తమవైపు..

గొర్రెలు, మేకల్లా ఎమ్మెల్యేలను బీజేపీ కొనేసింది: డీకే

పనజి: గొర్రెలు, మేకల వ్యాపారంలా గోవాలో ఎమ్మెల్యేలను బీజేపీ డబ్బులు ఎరచూపించి తమవైపు తిప్పుకొందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. అధికార పార్టీలోకి (బీజేపీ) తిప్పుకునేందుకు ఒక్కో ఎమ్మెల్యేకి రూ.30 కోట్ల వరకూ ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన 13 మంది ఎమ్మెల్యేలను ఈసారి ఎన్నికల్లో తిరిగి వెనక్కి తీసుకురాదని బలంగా కాంగ్రెస్ తీర్మానించుకుందని అన్నారు.


"బీజేపీ ధనబలం మీరంతా చూశారు. ఒక్కో ఎమ్మెల్యేను లాక్కునేందుకు 30 నుంచి 40 కోట్లు వెచ్చించింది. కొందరు ఎమ్మెల్లేలు అయితే తమకు 30 కోట్లు ఆఫర్ చేసినట్టు, కొంత అడ్వాన్‌గా ఇచ్చినట్టు అసెంబ్లీలోనే అంగీకరించారు. ఎమ్మెల్యేలను గొర్రెలు, మేకల్లా కొనేశారు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం పూర్తిగా విఫలమైంది'' అని ఎన్నికల ప్రచారంలో భాగంగా పనజి వచ్చిన డీకే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 2017-19 మధ్య బీజేపీకి ఫిరాయించిన కొందరు కాంగ్రెస్ నేతలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు తనతో సంప్రదింపులు సాగించినట్టు కూడా డీకే చెప్పారు. గోవాలో బీజేపీ 'ఆపరేషన్ లోటస్' చేపడితే, ఒక్క ఫిరాయింపుదారుని కూడా పార్టీలోకి తీసుకోకూడదని కాంగ్రెస్ నిర్ణయించిందని అన్నారు. ఈసారి యువకులు, కొత్త ముఖాలను అభ్యర్థులుగా ఎంపిక చేశామని, పార్టీ పట్ల విధేయతతో ఉంటామని అందరి చేతా ప్రమాణం చేయించామని చెప్పారు. 

Updated Date - 2022-01-29T02:29:40+05:30 IST