బీజేపీ కార్పొరేటర్లకు..టీఆర్‌ఎస్‌ నేతల సవాల్‌

ABN , First Publish Date - 2022-01-21T17:45:27+05:30 IST

మూడేళ్లలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ వెయ్యి కోట్లతో చేసిన అభివృద్ధిని తాము నిరూపిస్తామనీ.. ఏడాదిలో మీరేం అభివృద్ధి చేశారో

బీజేపీ కార్పొరేటర్లకు..టీఆర్‌ఎస్‌ నేతల సవాల్‌

అభివృద్ధిపై చర్చకు సిద్ధం 

హైదరాబాద్/ముషీరాబాద్‌:  మూడేళ్లలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ వెయ్యి కోట్లతో చేసిన అభివృద్ధిని తాము నిరూపిస్తామనీ.. ఏడాదిలో మీరేం అభివృద్ధి చేశారో చూపిస్తారా అని ముషీరాబాద్‌ నియోజకవర్గ బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్‌ నాయకులు సవాల్‌ విసిరారు.

గురువారం రాంనగర్‌లో విలేకరుల సమావేశంలో  టీఆర్‌ఎస్‌ ఐదు డివిజన్ల అధ్యక్షులు ఆర్‌.మోజెస్‌, నర్సింగ్‌ప్రసాద్‌, రాకేష్‌, బల్లశ్రీనివా్‌సరెడ్డి, వల్లాల శ్యామ్‌యాదవ్‌, సీనియర్‌ నాయకులు డి.శివముదిరాజ్‌, దీన్‌దయాల్‌రెడ్డి, మాధవ్‌, చిట్టి, ఎర్రం శేఖర్‌, లింగాల శ్రీకాంత్‌గౌడ్‌, జెల్ల భిక్షపతి, మురళి, శేఖర్‌, సదా మాట్లాడారు. కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ జి.కిషన్‌రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదనీ.. ఆయన చేసిన అభివృద్ధిని చూపిస్తారా అని వారు ప్రశ్నించారు.

గతంలో ఎమ్మెల్యేగా  ఉన్న డా.కె.లక్ష్మణ్‌, తమ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ చేసిన అభివృద్దిపై చర్చకు సిద్ధమా అని వారు సవాల్‌ విసిరారు. నిధులు లేని కార్పొరేటర్లు తమ రాజకీయ లబ్ధికోసం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఎమ్మెల్యేపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.  


సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెన్‌  

అభివృద్ధిపనుల్లో రాజకీయాలకు తావు లేకుండా బీజేపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే గోపాల్‌ చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎమ్మెన్‌ శ్రీనివా్‌సరావు హితవు పలికారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలనీ  మిగతావేళల్లో ప్రజల సంక్షేమం కోసం కలిసి పాటుపడాలన్నారు.

కేవలం రాజకీయ లబ్ధికోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయరాదని, అభివృద్ధి పనులకు కలిసి ముందుకు రావాలని, అప్పుడే ముషీరాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. 

Updated Date - 2022-01-21T17:45:27+05:30 IST