నీ శాఖపైనే అవగాహన లేదు..
ABN , First Publish Date - 2020-10-25T09:29:59+05:30 IST
‘నీ శాఖపైనే నీకు అవగాహన లేదు. అలాంటి నీవు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను విమర్శించటమా?’ అని మంత్రి శంకరనారాయణపై..
నీవు.. లోకేశ్ను విమర్శించటమా?..
మంత్రి శంకరనారాయణపై బీకే ఫైర్
పెనుకొండ, అక్టోబరు 24: ‘నీ శాఖపైనే నీకు అవగాహన లేదు. అలాంటి నీవు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను విమర్శించటమా?’ అని మంత్రి శంకరనారాయణపై టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి బీకే పార్థసారథి ధ్వజమెత్తారు. శనివారం పెనుకొండలోని స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి శంకరనారాయణకు తన శాఖపైనే ఇంతవరకు పూర్తి అవగాహన లేదన్నారు. ఇక జిల్లా వ్యవసాయంపై ఏం అవగాహన ఉందో చెప్పాలన్నారు. వాస్తవానికి మంత్రి జిల్లాలో ఓ దున్నపోతు ఉన్నట్లన్నారు. జిల్లాలో రైతులు ఎంత వేరుశనగ సాగు చేస్తారు? ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో విత్తనం వేశారు? ఎంత నష్టపోయారో చెప్పలేరన్నారు. నష్టం అంచనా గురించి సంబంధిత అధికారులతో ఎన్ని సమీక్షలు నిర్వహించారో చెప్పాలన్నారు. అవగాహన రాహిత్యంతో జిల్లాలో రూ.30వేల కోట్లు పంట నష్టపోయారని అంటున్నారనీ, అది అవాస్తవమన్నారు.
జిల్లాలో రైతులు ఈ యేడు 12.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, 2 లక్షల ఎకరాల పంట నష్టపోయారన్నారు. ఇది క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన వివరాల న్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్న ఆయన తన సొంత నియోజకవర్గంలోనే రోడ్ల గురించి పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. చివరకు ఆయన ఇంటికెళ్లే రోడ్డు కూడా అధ్వానంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. దీనిని బట్టి ఆయన పనితీరు అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా మంత్రి అవగాహన రాహిత్యం వీడి, నిజానిజాలు పూర్తిగా తెలుసుకుని, మాట్లాడటం మంచిదన్నారు.