ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే: కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-09-21T07:10:58+05:30 IST
రాజ్యసభ ఆదివారం ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాస్వామ్యానికి ఇదో బ్లాక్డే అని ఆరోపించింది...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: రాజ్యసభ ఆదివారం ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాస్వామ్యానికి ఇదో బ్లాక్డే అని ఆరోపించింది. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం కూడా రాష్ట్రాల పరిధిలోనే జరగాల్సి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. మరోవైపు బిల్లుల రూపంలో ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం డెత్ వారెంట్లు జారీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు.
రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు బీజేపీయేతర పార్టీలు రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేయాలని, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కాగా.. రాజ్యసభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేయవద్దని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు. పునఃపరిశీలన కోసం వాటిని తిరిగి పార్లమెంటుకు పంపించాలని కోరారు.