కృష్ణ బియ్యం - అద్భుత ఆహారం... వేదాల ఆధారంగా తెలుగు యువకుడి ప్రయోగాలు

ABN , First Publish Date - 2020-09-07T21:47:50+05:30 IST

హైదరాబాద్: అద్భుతమైన ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారం కృష్ణ వ్రీహి లేదా కృష్ణ బియ్యం. ఈ బియ్యానికి ఇటీవలే జీఐ ట్యాగ్ వచ్చింది.

కృష్ణ బియ్యం - అద్భుత ఆహారం... వేదాల ఆధారంగా తెలుగు యువకుడి ప్రయోగాలు

హైదరాబాద్: అద్భుతమైన ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారం కృష్ణ వ్రీహి లేదా కృష్ణ బియ్యం. ఈ బియ్యానికి ఇటీవలే జీఐ ట్యాగ్ వచ్చింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది. ఇది ప్రత్యేకమైన ఛాయగల దేశవాళీ వరి రకం. ఇతర రకాలతో పోల్చినపుడు దీనిలో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.


బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ కృష్ణ బియ్యంలో ఉంటుంది. కృష్ణ బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో కృష్ణ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు రుజువైంది. కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్‌ప్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు వెల్లడైంది. యాంథోసయనిన్ అత్యధికంగా గల ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి. దీనిలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. 


యూఎస్‌డీఏ ప్రకటించిన వివరాల ప్రకారం, ఒక కప్పు 100 గ్రాముల కృష్ణ బియ్యంలో క్రింది పోషకాలు ఉంటాయి: 

శక్తి - 356 కిలో కేలరీలు 

ప్రొటీన్లు - 8.8 నుంచి 12.5 గ్రాములు

 లిపిడ్స్ - 3.33 గ్రాములు 

ఐరన్ - 2.4 మిల్లీ గ్రాములు

అమిలోజ్ - 8.27 శాతం

కాల్షియం - 24.06 మిల్లీ గ్రాములు

మెగ్నీసియం - 58.46 మిల్లీ గ్రాములు 

యాంథోసయనిన్స్ - 69 నుంచి 74 మిల్లీ గ్రాములు


అనేక తీవ్ర వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి కృష్ణ బియ్యం ఉపయోగపడతాయని రుజువైంది. అదేవిధంగా మెదడు, కాలేయం పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుందని, బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుందని రుజువైంది. కడుపు మంట, బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుందని, మలబద్ధకాన్ని, అతిసారను నిరోధించేందుకు ఉపయోగపడుతుందని రుజువైంది. 


కృష్ణ బియ్యాన్ని ప్రధానంగా ఈశాన్య భారత దేశంలో పండిస్తారు. అయితే వీటిని తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా, కాశింపేట గ్రామంలో కౌటిల్య (86867 43452) విజయవంతంగా పండిస్తున్నారు. కౌటిల్య ప్రస్తుతం తిరుపతి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం చదువుతున్నారు. కృషి భారతం సంస్థను స్థాపించి వ్యవసాయ పరిశోధనలు చేస్తున్నారు. క్రమం తప్పకుండా వృషభోత్సవాలను నిర్వహిస్తున్నారు. 


ఆవిర్భావం, చరిత్ర: 

అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి మతపరమైన ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారు. 


ప్రాచీన భారతీయులకు కృష్ణ బియ్యం లక్షణాలు, దాని ఉపయోగాలు బాగా తెలుసు. అనేక ప్రాచీన గ్రంథాల్లో కృష్ణ బియ్యం గురించి వివరించారు. 

‘ఆయుర్వేద మమోదధి’లో అనేక వరి రకాలను వర్గీకరించి, వివరించారు. 


రక్తో భీరుక, పుండరీక (తెల్లని వరి రకం), కలమ (దళసరి బియ్యం - మే, జూన్‌లలో నాటుతారు, డిసెంబరు లేదా జనవరిలో పంట చేతికి వస్తుంది), మహాపుష్పకో (పెద్ద పువ్వులతో), డిర్ఘాహ్ (పొడవైన కంకులు), కంకణ (స్వర్ణ పొట్టు) మొదలైన రకాల గురించి వివరించారు. ‘చరక సంహిత’లో కూడా వేర్వేరు పంట రకాల గురించి వర్గీకరించి, వివరించారు. వాటికిగల ఔషధ లక్షణాలను కూడా వివరించారు. 


వీటిలో ఒకటి కృష్ణ వ్రీహి లేదా కృష్ణ శాలి లేదా బ్లాక్ రైస్. ఈ బియ్యాన్ని చర్మ రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించేవారనే నమ్మకం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శారీరక బలం వృద్ధికి వీటిని ఉపయోగించేవారని తెలుస్తోంది. 


కృష్ణ బియ్యం వంటి పిగ్మెంటెడ్ సిరీల్స్ యావత్తు భావన ఇటువంటి ఆహార ధాన్యాల ప్రాధాన్యాన్ని అధ్యయనం చేయడానికి పరిశోధకులకు, న్యూట్రిషనిస్టులకు ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో స్పష్టం చేస్తుంది. ఈ దేశవాళీ రకాలను కాపాడటానికి వ్యవసాయ రంగం ప్రాధాన్యం ఇవ్వాలి. ఫంక్షనల్ ఫుడ్ మార్కెట్ల విస్తరణలో పోటీ పడే కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఈ ధాన్యాలను ఫుడ్ ఇండస్ట్రీ ఉపయోగించుకోవచ్చు. 





Updated Date - 2020-09-07T21:47:50+05:30 IST