నినదించి.. నిరసించి..!
ABN , First Publish Date - 2021-06-18T05:30:00+05:30 IST
సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి. తాము ఎంచుకున్న అంశాలపై ఆయా పార్టీల నాయకులు శుక్రవారం జిల్లాలో ఆందోళనకు దిగారు.
సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్షాలు
సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి. తాము ఎంచుకున్న అంశాలపై ఆయా పార్టీల నాయకులు శుక్రవారం జిల్లాలో ఆందోళనకు దిగారు. ప్రజాసమస్యలు, ఆరోగ్యం, పెట్రో ధరలపై నినదించారు. నిరసన తెలిపారు. కరోనాతో దుర్భరంగా మారిన పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని టీడీపీ డిమాండు చేసింది. మృతుల కుటుంబీకులకు పరిహారం.. కొవిడ్తో దెబ్బతిన్న ఆయా రంగాలకూ ప్రోత్సాహం అందించాలని కోరింది. ఇలా 10 డిమాండ్లతో వినతిపత్రాన్ని అధికారులకు నేతలు అందించారు. మరోవైపు సెంచరీ దాటిన ‘పెట్రో’ ధరలపై వామపక్షాలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. దీనివల్ల నిత్యావసర ధరలూ పెరిగి పేదల నడ్డివిరిచారంటూ ధ్వజమెత్తారు. ఇక, కరోనా వేళ పట్టణాల్లో ఆస్తివిలువ ఆధారంగా పన్ను పెంచడం, యూజర్ చార్జీలతో ప్రజలపై భారం వేయడం సరికాదంటూ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వినతులు అందించారు.
- ఆంధ్రజ్యోతి, తిరుపతి