సీఐటీయూ ఆధ్వ్యంలో రక్తదాన శిబిరం
ABN , First Publish Date - 2021-06-15T05:52:09+05:30 IST
కరోనా కష్ట కాలంలో క్లిష్టమైన పరిస్థితుల మధ్య సీఐటీయూ రక్తదాన శిబిరాన్ని కొనసాగించడం గొప్ప విషయమని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ అన్నారు.
ఉక్కుటౌన్షిప్, జూన్ 14: కరోనా కష్ట కాలంలో క్లిష్టమైన పరిస్థితుల మధ్య సీఐటీయూ రక్తదాన శిబిరాన్ని కొనసాగించడం గొప్ప విషయమని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ అన్నారు. సేవ్ వైజాగ్ స్టీల్ప్లాంట్ పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, ఓ మంచి ఉద్దేశంతో రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నరసింగరావు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా నిర్విరామంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, కొవిడ్ సంక్లిష్ట పరిస్థితుల్లో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. కార్పొరేటర్ బి.గంగారావు మాట్లాడుతూ ప్లాంట్ రక్షణకు అందరూ ఐక్యంగా పోరాటాలు చేయాలని ఆకాంక్షించారు. ఉక్కు గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ రక్షణకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమన్నారు. వీఎస్జీహెచ్ సీజీఎం కేహెచ్.ప్రకాశ్ మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. తొలుత కొవిడ్ వలన మృతి చెందిన ఉక్కు ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లెండి కళాశాల చైర్మన్ మధుసూధన్, వై.టి.దాసు, మాటూరి శ్రీనివాసరావు, బి.అప్పారావు, సింహాచలం, రామస్వామి, కేఎం.శ్రీనివాసరావు, సీహెచ్.అరుణ్ పాల్గొన్నారు.