రక్తదానం.. సామాజిక బాధ్యత
ABN , First Publish Date - 2021-12-01T05:08:24+05:30 IST
రక్తదానం.. సామాజిక బాధ్యత
వికారాబాద్/తాండూరు/పరిగి/ఘట్కేసర్ : రక్తదానం అనేది ఒక సామాజిక బాధ్యత అని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి సాయిచౌదరి అన్నారు. మంగళవారం వికారాబాద్ ఆర్టీసీ డివిజన్ పరిధిలోని వికారాబాద్, పరిగి, తాండూరులలో రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా నేడు నిర్వహించిన రక్తదాన శిబిరంలో వికారాబాద్ డిపోలో 41 మంది, పరిగిలో 31 మంది, తాండూరులో 27మంది చొప్పున స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేశారన్నారు. వీరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ మూడు ప్రదేశాల్లో సేకరించిన 99 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు గల తాండూరు, వికారాబాద్లలో ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ ఆర్టీసీ డివిజన్ మేనేజర్ రమేష్, వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ దైవాధీనం, జిల్లా రెడ్క్రాస్ అధ్యక్షుడు డాక్టర్ భక్తవత్సలం, కోశాధికారి సత్యనారాయణగౌడ్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. అలాగే టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం తాండూరు ఆర్టీసీ డిపో ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఈ శిబిరాన్ని డాక్టర్ టి.వాణి మెడికల్ ఆఫీసర్, డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సోమ్లా, హెడ్క్లర్క్ వెంకటేశ్వర్లు, ఏఎంఎఫ్ సాధిక్ నవీన్, రవిసింగ్, శ్యామ్సుందర్రెడ్డి, బస్వరాజ్, బాలప్ప, పి.సి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పరిగి డిపోలో రక్తదాన శిబిరాన్ని డిపో మేనేజర్ బద్రి నారాయణ, వికారాబాద్ వైద్యాధికారి శ్రీజల చేతులమీదుగా ప్రారంభించారు.
111వ సారి రక్తదానం
ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 111సార్లు రక్తదానం చేసి అదరికీ ఆదర్శంగా నిలిచారు ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎ్ఫసీ నగర్కు చెందిన సిస్టా సూర్యనారాయణ (బొట్టుసూరి). ఎవరికి రక్తం అవసరమైనా నేనున్నానని ముందుకు వచ్చే సూర్యనారాయణ నగరంలోని మహాత్మగాంధీ బస్స్టేషన్లో నిర్వహించిన శిబిరంలో పాల్గొని 111వ సారి రక్తదానం చేశాడు, ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూర్యనారాయణను శాలువాతో సత్కరించి ధ్రువీకరణ పత్రం అందజేశారు.