మయన్మార్లో రక్తపాతం
ABN , First Publish Date - 2021-03-28T07:11:03+05:30 IST
మయన్మార్లో రక్తపాతం ఉధృతమవుతోంది. సైనిక పాలనకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న వారిని.. సైన్యం, పోలీసులు పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తున్నారు. శనివారం సైన్యం ఓ వైపు 76 ఆర్మీ డే ఉత్సవాలు జరుపుకొంటూనే..
91 మంది ఆందోళనకారుల కాల్చివేత.. 76వ ఆర్మీ డే రోజే దారుణం
పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపడేస్తున్న ఆర్మీ
ఈ నెల 14న 74 మంది కాల్చివేత
ఆ తర్వాత ఇదే అతిపెద్ద మారణహోమం
ఫిబ్రవరి నుంచి 400కు పైగా మరణాలు
యాంగాన్, మార్చి 27: మయన్మార్లో రక్తపాతం ఉధృతమవుతోంది. సైనిక పాలనకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న వారిని.. సైన్యం, పోలీసులు పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తున్నారు. శనివారం సైన్యం ఓ వైపు 76 ఆర్మీ డే ఉత్సవాలు జరుపుకొంటూనే.. ఆందోళనకారులపై తుపాకీ ఎక్కు పెట్టింది. వివిధ నగరాల్లో 91 మందిని కాల్చి చంపింది. డజన్ల కొద్దీ ఆందోళనకారులు క్షతగాత్రులయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. శనివారం ఉదయం 50 మరణాలు నమోదవ్వగా.. సాయంత్రం 4 గంటలకు ఆ సంఖ్య 74కు.. ఆరు గంటలకు 91కి పెరిగింది. ఓ వైపు ప్రభుత్వ టెలివిజన్లో సైన్యాధ్యక్షుడు జుంటా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘ప్రజలకు ఎలాంటి అపాయం జరగకుండా మిలటరీ అండగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంది’’ అని ప్రకటించగా.. మరోవైపు సైనికులు, పోలీసులు ఆందోళనకారులపై తుపాకీలతో విరుచుకుపడ్డారు. ఈ నెల 14న కూడా సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 74 మంది మృతిచెందారు.
ఆ ఘటనను నిరసిస్తూ.. శనివారం ప్రజలంతా రోడ్లెక్కారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా పోలీసులు, సైనికులు.. వారిపై కాల్పులు జరిపారు. ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసిన మయన్మార్ సైన్యం.. దేశాన్ని, పరిపాలనను తమ అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి సైనిక పాలన వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి. ఇప్పటి వరకు ఆందోళనకారుల అణచివేతకు సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 400కు పైగా మృతిచెంది ఉంటారని స్థానిక మీడియా, న్యాయవాదులు చెబుతున్నారు. అయితే.. సైనిక పాలకులు మాత్రం ఈ ఘటనలపై నోరు మెదపడం లేదు. ఈ చర్యలను పదవీచ్యుతులైన చట్టసభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఈ ఘటనలు సైన్యానికి సిగ్గుచేటని జుంటాకు వ్యతిరేకంగా ఏర్పడ్డ చట్టసభ్యుల బృందం (సీఆర్పీహెచ్) ప్రతినిధి డాక్టర్ సెసా మండిపడ్డారు. మయన్మార్లో ఊచకోతపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శనివారం నాటి ఘటనపై సైన్యాధ్యక్షుడిలో పశ్చాత్తాపం లేకపోగా.. అధికారిక టీవీ చానల్ ఎంఆర్టీవీ ద్వారా పరోక్ష హెచ్చరికలు చేయిస్తున్నారు. ‘‘యువకులారా.. ఆందోళనల్లో ముందున్న వారు చనిపోయారు. వారి తలల్లో, వీపు భాగాల్లో బుల్లెట్లు దూసుకుపోయాయి. దీని నుంచి గుణపాఠం నేర్చుకోండి’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనలు చేస్తే.. వారికి పట్టిన గతే మీకూ పడుతుందంటూ పరోక్షంగా హెచ్చరించారు.